దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన రహదారు ప్రతిరోజూ రక్తసిక్తంగా మారుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నా.. కొంత మంది నిర్లక్ష్యం.. మద్యం సేవించి వాహనాలు నడపడం.. డ్రైవర్ల నిద్రలేమి వల్ల ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి.
తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఎంపీలోని భిండ్ జిల్లాలోని గోహడ్ స్క్వేర్ ప్రాంతం వీర్ఖాది గ్రామం వద్ద వేగంగా వస్తున్న బస్సు.. ట్రక్కును ఢీకొట్టింది. దాంతో ట్రక్కు నుజ్జు నుజ్జుఅయ్యింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 13 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు ఫోన్ చేయడంతో వెంటనే రంగంలోకి దిగి స్థానికుల సహాయంతో క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారందరికీ గ్వాలియర్లోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీండ్ ఎస్పీ మనోజ్ సింగ్ వెల్లడించారు.