మనిషి తను చేసిన డబ్బుకు తానే దాసోహం అనే పరిస్థితి ఏర్పడింది. ఈ కాలంలో.. డబ్బెవరికి చేదూ అన్నట్టు ఆ డబ్బుకోసం ఏ గడ్డి తినడానికైనా వెనుకాడని పరిస్థితి నెలకొంది. మరి అలాంటి డబ్బు కట్టలు కట్టలు ఓ కాలువలో కొట్టుకొస్తే.. ఇది చూసే వారు కలా నిజమా అనే సందిగ్ధంలో పడిపోతారు. ఇది మాత్రం నిజం కట్టల కొద్ది రెండువేల రూపాయల నోట్లు ఓ సరస్సులో తేలుతూ కనిపించాయి. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్లోని ఓ సరస్సులో రెండు వేల రూపాయల కట్టలు కుప్పలుగా కనిపించడంతో జనాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన అక్కడకు వెళ్లి వీటిని స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ అజ్మేర్లోని ఆనాసాగర్ కాలువలో కొన్ని పాలిథీన్ బ్యాగులో రూ.2వేల నోట్ల కట్టలు కొట్టుకు వచ్చాయి. ఒక్కసారే కాలువలో రెండు వేల రూపాయల నోట్లను చూసిన అక్కడ జనాలు మొదట షాక్ తిన్నారు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఆ పాలిథీన్ బ్యాగ్ ని స్వాధీనం చేసుకున్నారు.
ఆ బ్యాగ్ లో ఉన్నవి అసలైన నోట్ల వలే ఉన్నాయని.. దాదాపు ముప్పై కట్టలు తమకు లభించాయని అన్నారు. నీటిలో తడవడం వల్ల అసలా.. నకిలా? అనే విషయం నిర్ధారించుకోలేకపోతున్నట్లు చెప్పారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ నోట్ల కట్టలను పాలిథీన్ బ్యాగులో పెట్టి కాలువలో విసిరేశారని వివరించారు. నిపుణుల సాయంతో నోట్ల అసలువో, కాదో తెలుసుకుంటామన్నారు.