శారీరక సంబంధం.. పెళ్లికి నిరాకరించడం వంటి విషయాల్లో బాంబే హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం పెట్టుకుని.. ఆపై పెళ్లికి నిరాకరించడం మోసం చేసినట్టు కాదని ఓ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అంతే కాదు ఇలాంటి ఓ కేసు విషయంలో 25 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పెళ్లి హామీతోనే తనతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి ఆ మహిళ అంగీకరించిందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది.
పెళ్లికి నిరాకరించడమనేది భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 417 కింద నేరం కాదని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పాల్గఢ్కు చెందిన వ్యక్తి తనతో శారీరక సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడంటూ 1996లో ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఐపీసీ 376(అత్యాచారం),ఐపీసీ 417(మోసం) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సమయంలో ఈ కేసు విషయంపై పలు దఫాలుగా వాదోపవాదనలు కూడా అయ్యాయి.
ఇది కూడా చదవండి : ప్రో కబడ్డీలో ఢిల్లీ శుభారంభం! అదరగొట్టిన నవీన్
ఈ కేసు విచారణ అనంతరం మూడేళ్ల తర్వాత పాల్గఢ్ అదనపు న్యాయమూర్తి నిందితుడిని దోషిగా తేల్చి ఏడాది జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించారు. దీంతో నిందితుడు బాంబే హైకోర్టులో అప్పీలు చేశాడు. తాజాగా ఈ కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. కాగా, వారిద్దరూ పరస్పర అంగీకారంతోనే శారీరక సంబంధం పెట్టుకున్నట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయని, అయితే, ఆమెను వివాహం చేసుకునే ఉద్దేశం అతడికి ఉన్నట్టు ఎలాంటి సాక్ష్యాలు లేవని తేల్చి చెప్పింది. ఏది ఏమైనా 25 సంవత్సరాల తర్వాత నిందితుడు నిర్దోషిగా బయటపడ్డాడు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.