ఆడపిల్ల అంటే.. ఆర్థిక సమస్యగానే భావించేవారు నేటికి కూడా మన సమాజంలో కోకొల్లలు. ఆడపిల్లను కంటే పెంచి.. పెద్ద చేసి.. పెళ్లి జరిపించి అత్తారింటికి పంపాలి. ఇదంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.. ఇక వారిని చదివించడం మరింత దండగ ఖర్చు అని భావించే తల్లిదండ్రులు నేటికి ఎందరో ఉన్నారు. కానీ వారికి కాస్త ప్రోత్సాహం ఇచ్చి వెన్ను తడితే.. ఆడపిల్లలు ఎన్ని విజయాలు సాధిస్తారో.. ఎంతటి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారో నిరూపించే సంఘటలను ఇప్పటికే అనేకం చూశాం. ఇక తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది.
ఆమెకు చదువంటే ప్రాణం. కానీ తల్లిదండ్రులకు ఉన్నత చదువులు చదివించే స్థోమత లేదు. అయినా ఆమె కుంగిపోలేదు. ప్రభుత్వ ఉద్యోగం కోసం తీవ్రంగా శ్రమించింది. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. కానీ అంతటితో ఆగలేదు. జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని బలంగా కోరుకుంది. ఆ మేరకు ఎంతో కృషి చేసింది. నేడు డీఎస్పీగా ఎన్నికయ్యింది. పెళ్లై, పిల్లలుండి, అత్తారింట్లో బాధ్యతలు, విధి నిర్వహణ కొనసాగిస్తూనే.. తీరిక వేళలో చదువుకుని కోరుకున్న జాబ్ సాధించి.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఆ వివరాలు..
బిహార్లోని బెగుసరాయ్ జిల్లాకు చెందిన బబ్లీ కుమారి సాధించిన విజయం ప్రస్తుతం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె కూడా అందరిలానే ఓ సాధారణ మహిళ. తల్లిదండ్రులకు పెద్ద కుమార్తె. అందుకే మంచి ఉద్యోగం సాధించి కుటుంబ బాధ్యతలు తీసుకోవాలని భావించింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడి చదివింది.
ఈక్రమంలో 2015లో బబ్లీ కుమారి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలక్టయ్యింది. బిహర్లోని ఖగారియా జిల్లాలో ఆమెకు పోస్టింగ్ ఇచ్చారు. అలా జీవితంలో తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి విధుల్లో చేరింది. తర్వాత ఆమెకు బెగుసరాయ్కు బదిలీ అయింది. కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరిన తర్వాత ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడింది.
కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నప్పటికి.. ఆమె మనసంతా ఉన్నత ఉద్యోగం మీదనే ఉండేదది. జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె కలలు కన్నది. ఇందుకోసం బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయలనుకుంది. పోలీస్ స్టేషన్లో విధులు, ఇంటి పనులు.. పిల్లల బాధ్యతలు ఇలా అన్నీ పూర్తయ్యాక దొరికిన కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకుంది. ఏమాత్రం ఖాళీ దొరికిన పుస్తకం చేత పట్టుకుని శ్రద్దగా చదువుకునేది.
అలా బీపీఎస్సీ పరీక్షలు రాసి మూడో ప్రయత్నంలో విజయం సాధించింది. ప్రస్తుతం పోలీస్ కానిస్టేబుల్గా పని చేస్తున్న బబ్లీ బీపీఎస్సీలో క్వాలిఫై అయినందున రాజ్గిర్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తీసుకోనుంది. శిక్షణ కాలం ముగిసిన తర్వాత ఆమె బిహర్ పోలీస్ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్గా బాధ్యతలు చేపట్టనుంది.
బబ్లీ సాధించిన విజయం చూసి ఆమె కుటుంబ సభ్యులు పొంగిపోతున్నారు. తమ బిడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ.. ఉన్నత ఉద్యోగం సాధించిన బబ్లీని ఉన్నతాధికారులు సన్మానించారు. ఆమె సాధించిన విజయం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.