శంషాబాద్- రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో సామాన్య భక్తులతో పాటు చాలా మంది ప్రముఖులు పాల్గొంటున్నారు. రామానుజాచార్యుల సమతా మూర్తి సహస్రాబ్ది ఉత్సవాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. అమిత్ షా వెంట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు ఉన్నారు.
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ముచ్చింతల్ లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చారు. అమిత్ షాకు చినజీయర్ స్వామి, మై హోం గ్రూప్ చైర్మెన్ జూపల్లి రామేశ్వరరావు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీరామ నగరంలోని చిన జీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకున్న అమిత్ షా తిరునామం ధరించి ముచ్చింతల్ లోని దివ్యక్షేత్రాలను సందర్శించారు.
ఇది కూడా చదవండి : మరణించి వెయ్యేళ్లు.. ఇప్పటికీ ఆ శరీరం భద్రంగా..! ఎవరీ రామానుజాచార్యులు?
శ్రీ రామానుజ సమతా మూర్తి విగ్రహాన్ని ఆయన సందర్శించారు. దాదాపు మూడు గంటల పాటు ఆయన సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్నారు. సమతామూర్తి ప్రాంగనంలోని 120 కిలోల బంగారు రామానుజ మూర్తిని అమిత్ షా దర్శించుకున్నారు. ఆ తరువాత ప్రవచన మండపంలో జరిగిన ధర్మాచార్య సదస్సులో పాల్గొన్నారు. ఆ తరువాత సమతా మూర్తి 3 డీ మ్యాప్ లేజర్ షోను తిలకించారు.
యాగశాలలో శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞ హోమ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు అమిత్ షా. చిన జీయర్ స్వామితో తనకు 2003 నుంచి పరిచయం ఉందని ఈ సందర్బంగా ఆయన చెప్పారు. గుజరాత్ లో వరదల సమయంలో జీయర్ స్వామి ఎంతో సాయం చేశారని అమిత్ షా గుర్తు చేశారు. కార్యక్రమం తరువాత ఆయన ముచ్చింతల్ ఆశ్రమం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిపోయారు.