భారతదేశ చరిత్రలోనే కాక.. ప్రపంచ చరిత్రలో కూడా కోహినూర్ వజ్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ వజ్రం కోసం యుద్ధాలు.. భారీ ఎత్తున రక్తపాతం జరిగింది. చారిత్రక నేపథ్యమే కాక భారీ విలువ కలిగిన కోహినూర్ వజ్రం ప్రస్తుతం బ్రిటన్ రాజవంశం దగ్గర ఉంది. రాణి ధరించే కిరీటంలో చిక్కుకుపోయింది. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. కోహినూర్ వజ్రం ప్రస్తావన మరోసారి తెర మీదకు వచ్చింది. మనవాడే ప్రధాని అయ్యాడు.. కోహినూర్ని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తే.. బాగుంటుందనే ప్రతిపాదన మరోసారి తెర మీదకు వస్తోంది. చాలా మంది దీని గురించి సోషల్ మీడియాలో ఫన్నీగా ట్వీట్లు చేస్తున్నారు. కానీ వాస్తవంగా కొన్నాళ్ల క్రితమే కోహినూర్ని భారత్కి తిరిగి రప్పించే ప్రయత్నం చేశారు నాయకులు. ఆ వివరాలు..
కోహినూర్ వజ్రం.. ఈ పేరుతో భారతీయులకు.. మరీ ముఖ్యంగా తెలుగు వారికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందుకంటే.. ఈ అమూల్యమైన వజ్రం దొరికింది మన తెలుగు గడ్డపైనే. మరి తెలుగు నేలపై దొరికిన ఈ వజ్రం దేశ సరిహద్దులు దాటి బ్రిటీష్ వారి చేతికి ఎలా చేరింది అనే దాని గురించి రెండు మూడు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం కొల్లూరు గనుల్లో కోహినూర్ వజ్రం దొరికినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ వజ్రం క్రీస్తుశకం 13 వందల సంవత్సరంలో మాల్వరాజు మహలక్ దేవ్ వద్ద ఉండేదని భావిస్తున్నారు. ఆ తరువాత ఓ యుద్ధంలో అల్లావుద్దీన్ ఖిల్జీ మాల్వా రాజును ఓడించి.. అక్కడి అశేష ధనరాసులతో పాటు కోహినూర్ వజ్రాన్ని కూడా తనతో తీసుకెళ్లినట్టు చరిత్రకారులు పేర్కొంటున్నారు.
మరో కథనం ప్రకారం.. కొల్లూరులో లభ్యమైన కోహినూర్.. కాకతీయుల కాలంలో గోల్కొండ కోటలో ఉండేదట. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు 1310వ సంవత్సరంలో దాన్ని ఢిల్లీ సుల్తానుకు పంపినట్టు మరో కథనం ప్రచారంలో ఉంది. అలా ఢిల్లీ సుల్తానుల నుంచి 1849 నాటికి సిక్కు రాజు మహారాజా రంజిత్ సింగ్ దగ్గరికి చేరింది. ఆయన దాన్ని తన కిరీటంలో ధరించినట్టు చరిత్ర చెబుతోంది. ఇక 1839లో ఆయన మరణం తరువాత.. కోహినూర్ వజ్రం.. రంజిత్ సింగ్ వద్ద నుంచి దిలీప్ సింగ్ చెంతకు చేరింది. 1849లో బ్రిటన్ సేనలు దిలీప్సింగ్ను ఓడించాయి. ఆ సమయంలో అతడు వజ్రాన్ని విక్టోరియా మహారాణికి బహుమతిగా ఇచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
అలా ఎన్నో రాజ్యాలు, రాజుల చేతి నుంచి చివరకు బ్రిటన్ రాణి వికోరియా చెంతకు చేరింది కోహినూర్ వజ్రం. ఆ సమయానికి దాని బరువు 186 క్యారెట్లు. ఆ తర్వాత దాన్ని సానబెట్టించి.. దాన్ని కిరీటంలో తాపడం చేయించారు. అప్పటి నుంచి కోహినూర్ వజ్రం.. బ్రిటన్ రాజ కుటుంబం కిరీటంలోనే ఉంది. ఇక విక్టోరియా రాణి తర్వాత కోహినూర్ వజ్రాన్ని పొదిగిన ఆ కిరీటాన్ని క్వీన్ అలెగ్జాండ్రా, క్వీన్ మేరీ, క్వీన్ ఎలిజబెత్-2 ధరించారు. ఈ క్రమంలో సుమారు 70 ఏళ్ల పాటు బ్రిటన్ను పాలించిన మహారాణి ఎలిజబెత్-2 96 ఏళ్ల వయస్సులో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
ఎలిజబెత్-2 మృతి తర్వాత.. ప్లాటినం కిరీటంలోని ఈ వజ్రం ఇప్పుడు ఎవరికి దక్కుతందన్న చర్చ అటు యూకేలోనూ.. ఇటు ఇండియాలోనూ ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే బ్రిటన్ రాచరిక వ్యవస్థ ప్రకారం.. ప్లాటినం కిరీటం… సహజంగా రాజు భార్యగా రాణికి దక్కుతుంది. దాని ప్రకారం చూస్తే.. ప్రస్తుతం కింగ్గా బాధ్యతలు చేపట్టిన చార్లెస్ భార్య అయిన కెమిల్లాకు ఆ కిరీటం దక్కాలి. అయితే.. ఇక్కడో ట్విస్ట్ ఉంది. చార్లెస్కు కెమిల్లా రెండో భార్య కావడం.. ఆమెకు కూడా ఇది రెండో వివాహం కావడంతో… ఆమెకు ప్లాటినం కిరీటం దక్కుతుందా.. లేదా అన్న అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి.
ప్రస్తుత కింగ్ చార్లెస్ మొదటి భార్య డయానా. అయితే 1996లో చార్లెస్, డయానా ఇద్దరు విడిపోయారు. ఆ తరువాత ఏడాదికే ఓ రోడ్డు ప్రమాదంలో డయానా మరణించారు. అయినప్పటికి ఆమె గౌరవార్థం నేటికి కూడా ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్గా డయానానే కొనసాగిస్తున్నారు. ఇక చార్లెస్.. 2005లో కెమిల్లాను రెండో వివాహం చేసుకున్నా.. ఆమెకు మాత్రం ప్రిన్సెస్ హోదా దక్కలేదు. అయితే కెమిల్లాకు రాణి హోదా దక్కాలని ఎలిజబెత్-2 ప్లాటినం జూబ్లి వేడుకల్లో ఆకాంక్షించారు. దీనిపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో.. కిరీటం కెమిల్లాకు దక్కుతుందా లేదా అన్న అనుమానాలు తెర మీదకు వచ్చాయి.
ఎలిజబెత్-2 మృతి, రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంతో.. మరోసారి కోహినూర్ని ఇండియాకు తిరిగి తీసుకువచ్చే అంశం తెర మీదకు వచ్చింది. ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు. అయితే ఏళ్ల క్రితమే భారత ప్రభుత్వం.. కోహినూర్ని ఇండియా తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. కోహినూర్ని ఇండియాకు తిరిగి ఇవ్వాలని అనేకసార్లు కోరింది. అయితే దీనిపై 2010లో అప్పటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ స్పందిస్తూ.. ‘‘ఒకవేళ భారత్కు కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇవ్వాల్సి వస్తే.. చాలా దేశాలకు.. చాలా వస్తువులను ఇచ్చేయాల్సి వస్తుంది. అప్పుడు బ్రిటీష్ మ్యూజియం మొత్తం ఖాళీ అవుతుందంటూ’’ చమత్కరిస్తూనే.. కోహినూర్ని తిరిగి ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చిచెప్పాడు.
కోహినూర్ని ఇండియాకు తిరిగి తీసుకవచ్చే విషయం మీద కొన్నాళ్ల క్రితం భారత అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కోహినూర్ వజ్రాన్ని వెనక్కి తీసుకురావడం కష్టమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజర్ యాక్ట్-1972 ప్రకారం.. దేశం నుంచి అక్రమంగా ఎగుమతి చేసినవి.. లేదా దొంగతనం చేసిన అరుదైన వస్తువులు, సంపదను మాత్రమే తిరిగి పొందే అవకాశం ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బ్రిటిష్ వారికి బహుమతిగా ఇచ్చిన కోహినూర్ వజ్రాన్ని వెనక్కి ఇచ్చేయమని బ్రిటన్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
ఇక చరిత్ర చూసినా ఇదే విషయం స్పష్టం అవుతోంది. బ్రిటన్ రాజకుటుంబాన్ని చేరే వరకు కూడా కోహినూర్ వజ్రం కానుకగా ఇవ్వడం ద్వారా చేతులు మారిందే తప్ప.. దాన్ని బలవంతంగా ఎవరు లాక్కోలేదు.. అమ్మడం కూడా జరగలేదు. ఈ కారణంగా ఇప్పటి వరకు కోహినూర్ వజ్రానికి శాశ్వత యజమానులు అంటూ ఎవరు లేరు. ఈ వజ్రానికి అసలు యజమాని ఎవరన్న దానిపై కూడా గత కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోంది.
అయితే కోహినూర్ వజ్రానికి అసలు యజమానులు మేం అంటే మేం అంటూ.. భారత్తో సహా మరో నాలుగు దేశాలు పోటీకి వస్తున్నాయి. ప్రస్తుతం ఈ దేశాల మధ్య కోహినూర్ వజ్రం యాజమాన్య హక్కుకు సంబంధించిన వివాదం కొనసాగుతోంది. ఇక స్నేహపూర్వక పద్ధతిలో వజ్రాన్ని బ్రిటన్ నుంచి తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత పురావస్తు శాఖ కొంతకాలం క్రితం ప్రకటించింది. ఇదిలావుంటే, కోహినూర్ తమదంటే తమదేనని పాకిస్థాన్, ఇరాన్, అఫ్ఘానిస్థాన్ దేశాలు కూడా వాదిస్తున్నాయి. కోహినూర్ను తమకే అప్పగించాలంటూ.. 1976లో పాక్ ప్రధాని భుట్టో బ్రిటన్ ప్రధానికి లేఖ కూడా రాశారు. 2000లో తాలిబన్లు కూడా కోహినూర్ తమదేనని, త్వరగా తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో.. భారత ప్రభుత్వం మరోసారి కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే బాగుండును అనే మాట వినిపిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో అనేక ఫన్నీ మీమ్స్ కూడా దర్శనం ఇస్తున్నారు. ఏకంగా సునాక్ని కిడ్నాప్ చేసి.. ఆ స్థానంలో ఆశిష్ నెహ్రాను బ్రిటన్కి పంపి.. కోహినూర్ని తిరిగి తేస్తే బాగుండు అనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే అది మనం అనుకున్నంత ఈజీ కాదు.
పేరుకు రిషి సునాక్ భారత మూలాలు కలిగిన వ్యక్తే అయినప్పటికి.. వాస్తవానికి బ్రిటన్ పౌరుడు . తను ఆ దేశ సంక్షేమం కోసం ఆలోచిస్తాడు.. ఆలోచించాలి. పైగా అక్కడ ప్రధాని పదవి అంటే మన దగ్గర రాష్ట్రపతి పదవికి ఉన్నటువంటి నామమాత్రపు అధికారాలు మాత్రమే ఉంటాయి. ఒకవేళ సునాక్.. కోహినూర్ని భారత్కు తిరిగి ఇచ్చేందుకు అంగీకరిస్తే.. అతడిపై బ్రిటన్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. పదవి కోల్పోయే పరిస్థితులు కూడా తలెత్తుతాయి. అసలు కోహినూర్ని తిరిగి ఇచ్చేందుకు బ్రిటన్ రాజకుటుంబం ఒప్పుకోదు. కాకపోతే రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికవ్వడంతో.. మరోసారి కోహినూర్ వజ్రం ప్రస్తావన తెర మీదకు తీసుకవచ్చారు నెటిజనులు.