నేటి తరంలో మానవత్వ విలువలు కుంచిచుకుపోతున్నాయి. సొంతలాభం కొంత మానుకుని.. పొరుగువాడికి సాయపడవోయ్ అన్న గురజాడ వ్యాఖ్యలను పెడచెవిన పెట్టేస్తున్న ధోరణి కనబడుతోంది. ఆపద, అత్యవసర పరిస్థితిలో చేయందించే ఆపన్న హస్తం కరువౌతోంది. ఏం చేస్తే తమకు ఏం నష్టం జరుగుతుందోనని వెనకడుగు వేస్తున్నారు. తమ ముందు జరుగుతన్న అన్యాయాన్ని ఎదురించడం కాదూ కదా.. కనీసం స్పందించేందుకు కూడా ముందుకు రావడం లేదు. దీని వల్ల ఓ కానిస్టేబుల్ తన ప్రాణాలను కోల్పోయిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. తన భర్త ఫోన్ ను అనిష్ రాజ్ అనే దొంగ దొంగిలించి, తమను బెదిరించాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దొంగతనం జరిగిన ప్రాంతానికి చేరుకున్న 56 ఏళ్ల శంభు దయాల్ అనే పోలీస్ కానిస్టేబుల్ కు సదరు మహిళ.. దొంగను చూపించింది. దొంగను పట్టుకున్నకానిస్టేబుల్, పోలీస్ స్టేషన్ కు తీసుకెళుతున్నారు. అంతలో, తన దగ్గర దాచుకున్న కత్తితో దొంగ ఆయన్ను వెనుక నుండి ఒక్కసారిగా పొడిచాడు. వెంటనే మెడ, ఛాతీ, పొట్టలో 12 సార్లు కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్ తిరిగి పోరాడేందుకు ప్రయత్నించగా.. అతడిని బలంగా తోసేసిన దొంగ.. అక్కడి నుండి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే డ్యూటీలో ఉన్న మరో పోలీసు దొంగను పట్టుకున్నారు.
ఇంతా జరుగుతున్న అక్కడే ఉన్న జనం అంతా సినిమా చూస్తున్నట్లు చూశారే కానీ, కనీసం ఆ దొంగను నిలువరించేందుకు కానీ, కానిస్టేబుల్ ను కాపాడే ప్రయత్నం కానీ చేయలేదు. దొంగ, కానిస్టేబుల్ ను పొడిచి పారిపోతున్నప్పడు మాత్రమే జనం అతడి వెంట పరుగులు తీశారు. ఈ దృశ్యాలన్నీ కూడా అక్కడ సిసిటివి లో రికార్డు అయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ ను ఆసుప్రతికి తరలించగా.. నాలుగు రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. ముగ్గురు పిల్లల తండ్రైన కానిస్టేబుల్ శంభుదయాల్ రాజస్తాన్ వాసి. ఆయన మరణంతో ఆ ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయినట్లయింది. కాగా, కానిస్టేబుల్ మృతికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సాహసాన్ని సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియాను కేజ్రీవాల్ ప్రకటించారు.