సరదాగా తిన్న చాట్ మసాలా 80 మందిని ఆస్పత్రి పాలు చేసింది. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం గమనార్హం. ఒక్కసారిగా ఇంత మంది రోగులు ఆస్పత్రికి రావడంతో బెడ్ల కొరత, వైద్య సిబ్బంది కొరత ఏర్పడింది.
ఒక గ్రామంలో జరిగిన జాతరలో ‘కల్తీ చాట్ మసాలా’ తిని 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలే ఉండటం గమనార్హం. ఈ ఘటన బుధవారం రాత్రి 10:30 గంటల ప్రాతంలో చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన వారందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎక్కువమంది చిన్నారులు వాంతులు చేసుకోవడంతో నీరసించిపోయారు. తద్వారా శరీరంలో నీటి కొరత ఎర్పడింది. ఈ విషాద ఘటనలో బాధాకర విషయం ఏంటంటే.. బాధితులకు సెలైన్ అందించేందుకు స్టాండ్ లేకపోవడంతో బంధువులు సెలైన్ చేత పట్టుకొని నిలబడే పరిస్థితి ఏర్పడింది.
జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాలోని కర్మతాండ్ పంచాయతీ పరిధిలోని భోక్తా గ్రామంలో బుధవారం సాయంత్రం జాతర జరిగింది. ఈ సందర్భంగా జాతరకు వచ్చిన సుమారు 80 మంది కల్తీ ‘చాట్ మసాలా’ తిని అనారోగ్యం పాలయ్యారు. జాతర నుంచి తిరిగి ఇంటికి వెళ్ళాక వారంతా కడుపు నొప్పి, వాంతులతో బాధపడ్డారు. వెంటనే గ్రామస్థులు అప్రమత్తమై వారందరిని స్థానిక షాహిద్ నిర్మల్ మహతో మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు తరలించారు. ఇంత మంది రోగులు ఒక్కసారిగా ఆస్పత్రికి రావడంతో బెడ్ల కొరత ఏర్పడింది. ప్రస్తుతం ఆస్పత్రి అంతటా ఎమర్జెన్సీని తలపిస్తోంది. ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి అదనంగా డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని రప్పించి చికిత్స అందిస్తున్నారు.
అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువ మంది పిల్లలు ఉండటం బాధాకర విషయం. ప్రస్తుతం ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అస్వస్థతకు గురైన చిన్నారులకు సెలైన్ నింపుతుంటే వారి తల్లిదండ్రులు వాటిని చేతబట్టుకొని నిలబడ్డ దృశ్యాలు బయటకొస్తున్నాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఆస్పత్రికిచేరుకొని.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నారు. దీనిపై విచారణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఆసుపత్రికి చేరుకుని రోగులు మరియు వారి బంధువుల నుండి సంఘటన గురించి సమాచారం తీసుకున్నారు.
Food Poisoning in Jharkhand: 80 People, Mostly Children, Fall Sick in Dhanbad After Having Food With Spurious ‘Chaat Masala’ at Village Fair #FoodPoisoning #Jharkhand #Dhanbad https://t.co/NMqVAg40Kc
— LatestLY (@latestly) April 20, 2023