దేశం శాస్త్ర సాంకేతికంగా ఎంతగానో అభివృద్ధి చెందుతున్నా.. కుల, మతాల పేరిట కోట్లాటలు జరుగుతూనే ఉన్నాయి. నగరాలతో పోలిస్తే, గ్రామాల్లో కుల రక్కసి కోరలు చాచుతూనే ఉంది. కులాల పేరుతో కొన్ని కొన్ని ఊర్లు, నగరాలు కుంపటిని రగుల్చుకుంటున్నాయి. అగ్ర కులాల ఆధిపత్య పోరులో అణగారిన వర్గాలు అందులో ఆహుతి అవుతున్నాయి. బావిలో నీరు తాగకూడదని, తమ ఇళ్లల్లోకి రాకూడదని, అగ్ర కులానికి చెందిన అమ్మాయిలు, అబ్బాయిలతో స్నేహం, ప్రేమించడం చేయకూడదన్న ఆంక్షలు వేస్తుంటారు. వారిని కాదని చేస్తే బాధిత కుటుంబాలను ఊరి నుండి వెలసేసిన ఘటనలు చాలానే విన్నాం. ఇటువంటి ఘటనే గుజరాత్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ లోని బిలోడా తాలూకాలో భూతవాడ్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలోని నాయి బ్రాహ్మణుల (బార్బర్)లకు చెందిన 17 కుటుంబాలు నెల రోజుల నుండి సామాజిక బహిష్కరణకు గురయ్యాయి. వీరి చేసిన తప్పు ఏంటో తెలుసా.. వారి కులానికి చెందిన ఓ వ్యక్తి, అగ్ర కులానికి చెందిన అమ్మాయిని వివాహమాడటమే. చౌదరి (గుజరాత్ పటేల్)కి కుటుంబానికి చెందిన అమ్మాయి, నాయి బ్రాహ్మణులకు చెందిన సచిన్ అనే అబ్బాయి ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోరని తెలిసి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. దీంతో అగ్రవర్ణానికి చెందిన వారూ, ఆ గ్రామంలో నివసిస్తున్న 17 నాయి బ్రాహ్మణ కుటుంబాలను వెలివేశారు.
గత నెల 9న వీరి వివాహ ధృవీకరణ పత్రం అందిన తర్వాత, మమ్మల్ని గ్రామ బహిష్కరణ చేశారని సచిన్ తండ్రి చెప్పారు. మా అమ్మాయిని వెనక్కు పంపాలని, లేకుంటే ఒక్క కుటుంబాన్ని ఈ గ్రామంలో లేకుండా చేస్తామని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. మా ఇంటిపై రాళ్లు రువ్వారని, కరెంట్ కూడా తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాహాన్ని తాము అంగీకరించడం లేదని, అయినప్పటికీ.. వారు తమను సామాజిక బహిష్కరణ చేశారని, మా కుటుంబాలకు పాలు, ఇతర కిరాణా సామాగ్రిని అమ్మడం మానేశారని ప్రభుదాస్ అనే బాధితుడు చెప్పారు. గర్భీణీలు, మహిళల పట్ల చెడుగా ప్రవర్తిస్తున్నారని, పిల్లలను పాఠశాలలకు అనుమతించదం లేదని వాపోయారు.
అగ్ర వర్ణాల వారితో మాట్లాడేందుకు ప్రయత్నించినా, వారు గ్రామంలోని రానివ్వకుండా మొండిగా వ్యవహరిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై కలెక్టరేట్ లో మొమొరాండమ్ సమర్పించామని ప్రభుదాస్ చెప్పారు. ఆ గ్రామంలోనే పునారావాసం కల్పించాలని కలెక్టర్ మీనాకు విన్నవించామన్నారు. దీనిపై కలెక్టర్ స్పందించారు. ఈ సమస్య తమ దృష్టికి వచ్చిందని, గ్రామాన్ని సందర్శించి, సమస్యను 24 గంటల్లో పరిష్కరించాలని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, స్థానిక అధికారులను ఆదేశించానన్నారు.