ఈ హెరిటేజ్ సిటీ నిర్మాణం కోసం అధికారులు ఇప్పటికే పూర్తి ప్రాజెక్ట్ను సిద్ధం చేశారు. ఆలయం ముందు ఓ పెద్ద 100 అడుగుల కృష్ణుడి విగ్రహాన్ని ఉంచనున్నారు. మొత్తం మూడు దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తవనుంది.
ఢిల్లీ యమునా ఎక్స్ ప్రెస్ హైవే మధుర-బృందావన్ సమీపంలో అద్భుతమైన ఓ హెరిటేజ్ సిటీని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అక్షరధామ్ ఆలయం తరహాలో ఈ హెరిటేజ్ సిటీలో ఓ కృష్ణుడి ఆలయాన్ని నిర్మించబోతున్నారు. ఈ హెరిటేజ్ సిటీలో ఉదయపూర్లోని శిల్పగ్రామ్ తరహా ఓ గ్రామాన్ని.. ఢిల్లీలోని హై-స్ట్రీట్ మార్కెట్ తరహా మార్కెట్ను నిర్మించనున్నారు. ఈ హెరిటేజ్ సిటీకి సంబంధించిన డిటెల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పటికే తయారైంది. ఈ రిపోర్ట్ను అధికారులు ప్రాజెక్ట్ అప్రైజల్ కమిటీకి పంపారు. ఇక, ఈ నగరాన్ని 2034 నాటికి మూడు దశల్లో నిర్మించటానికి అధికారులు నిర్ణయించారు.
మొత్తం 750 ఎకరాల్లో హెరిటేజ్ సిటీ ఉండనుంది. అంతేకాదు.. ఓ 100 అడుగుల కృష్ణుడి విగ్రహాన్ని ఈ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు. హెరిటేజ్ సిటీ గురించి యమున ఎక్స్ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ సీఈవో అరుణ్ వీర్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ ఇందులో ఓ ఆధ్యాత్మిక క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నాము. అక్కడ శ్రీకృష్ణుడి జీవితంలోని ముఖ్య ఘట్టాలు ప్రదర్శితమవుతాయి. ఈ నగరంలో హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను.. కృష్ణుడి బోధనలు తెలిపే ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయనున్నాము. అక్షరధామ్ దేవాలయం తరహాలో స్లైడ్ షో, సౌండ్ షోలు ఉంటాయి’’ అని తెలిపారు.
కాగా, హెరిటేజ్ సిటీ నిర్మాణం మొత్తం మూడు దశల్లో జరగనుంది. మొదటి దశలో భాగంగా 2024-27 మధ్య కాలంలో దేవాలయం, సాంస్కృతిక గ్రామం అభివృద్ది చేయనున్నారు. రెండవ దశలో భాగంగా.. 2028-31 మధ్య కాలంలో నగరంలోని ప్రజా సౌకర్యాలపై దృష్టి పెట్టనున్నారు. మూడవ దశలో భాగంగా.. 2032-34 మధ్య కాలంలో వేదశాస్త్రం, కళల ప్రదర్శన, యోగా ఆయుర్వేదం లాంటి కోర్సులు అందించే సంస్థలను ఏర్పాటు చేయనున్నారు. మరి, అద్భుతమైన హెరిటేజ్ సిటీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.