షిరిడీ సాయిబాబా దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు-ట్రక్కు ఢీకొన్న ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు చనిపోయారు. సాయిబాబా దర్శనం కోసం మహారాష్ట్రలోని థానే నుంచి 50 మంది భక్తులతో వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు ఫుల్ స్పీడుతో దూసుకొచ్చి ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. నాసిక్-షిరిడీ నేషనల్ హైవే మీద పఠారే సమీపంలో జరిగిన ఈ యాక్సిడెంట్లో పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో 34 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పఠారే సమీపంలో జరిగిన ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో కొందరిని సిన్నార్లోని రూరల్ హాస్పిటల్కు, మరికొందరిని స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. యాక్సిడెంట్కు పొగమంచు, అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ ఘటనపై ఆయన సమగ్ర విచారణకు ఆదేశించారు.