ఫిల్మ్ డెస్క్- అప్ఘనిస్తాన్.. ఇప్పుడు ప్రపంచమంతా మారుమ్రోగిపోతున్న దేశం. తాలిబన్లు పూర్తిగా ఆక్రమించుకోవడంతో మరోసారి అఫ్ఘనిస్తాన్ పై అందరి దృష్టి పడింది. తాలిబన్ల ఆక్రమణతో ఆప్ఘనిస్తాన్ లో ఎంత భయానకర పరిస్థితులు ఉంటాయో ఇప్పుడు మరోసారి అందరికి తెలుస్తోంది. అఫ్గనిస్తాన్ లో అక్కడి పౌరుల రక్షణకే దిక్కులేదు. తాలిబన్లు ఎప్పుడు ఎవరిని కాల్చి చంపుతారో తెలియదు. మరి అలాంటి అఫ్ఘనిస్తాన్ లో సినిమా షూటింగ్ అంటే ఆశామాషీ వ్యవహారం కాదు.
అసలు అలాంటి సాహసం చెయ్యడానికి ఎవ్వరు ముందుకు రారు. కాని మన తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఇద్దరే ఇద్దరు హీరోలు అఫ్ఘనిస్తాన్ లో జరిగిన షూటింగ్ లో పాల్గొన్నారు. అందులో ఒకరు అక్కినేని నాగార్జున ఐతే, మరొకరు సత్యదేవ్. అవును తెలుగు ఇండస్ట్రీలో వీళ్లిద్దరే షూటింగ్ కోసం అఫ్ఘనిస్తాన్ వెళ్లి వచ్చారు. అమితాబ్ బచ్చన్, శ్రీదేవి, అక్కినేని నాగార్జున కీలక పాత్రల్లో నటించిన ఖుదా గవాహ్ సినిమా షూటింగ్ ఆఫ్ఘానిస్తాన్ లో జరిగింది.
1992లో ఈ సినిమా షూటింగ్ కోసం అక్కినేని నాగార్జున అఫ్ఘనిస్తాన్ వెళ్లారు. ఆఫ్ఘాన్ సరిహద్దు గ్రామాల్లో నివశించే ప్రజల నేపథ్యంలో సాగే కధ కావడంతో అక్కడ షూటింగ్ చేశారు. ఇక నాగార్జున తరువాత అఫ్ఘనిస్తాన్ లో సినిమా షూటింగ్ చేసిన తెలుగు హీరో సత్యదేవ్. సత్యదేవ్ నటించిన హిందీ చిత్రం హబీబ్ చిత్రీకరణ అఫ్ఘాన్ లో జరిగింది. ఉగ్రవాదుల చేతుల్లో చిక్కుకున్న తన కొడుకుని వెతుక్కుంటూ అఫ్ఘనిస్థాన్కు వెళ్లే ఇండియన్ ఆర్మీ ఆఫసర్ కథే హబీబ్.
ఈ సినిమా షూటింగ్ ఆఫ్ఘాన్, కాబూలి ప్రాంతాల్లో 40రోజులపాటు జరిగింది. మొదటిరోజు అనుమతి లేకుండా షూటింగ్ చేస్తుంటే అక్కడివాళ్లు పాయింట్ బ్లాక్లో గన్ పెట్టారని, అతి కష్టంమీద ప్రాణాలతో బయటపడ్డానని సత్యదేవ్ చెప్పారు. ఆ తరువాత ఆప్ఘన్ జనాలు సినిమా షూటింగ్ కు బాగా సహకరించారని గుర్తు చేసుకున్నారు.