హైదరాబాద్- తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే సీతక్క సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి బానిస రాఖీ కట్టిందంటూ టీఆర్ ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై సీతక్క ఘాటుగా స్పందించారు. అన్నా చెల్లెల్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండగను కూడా రాజకీయం చేస్తున్నారంటూ ఆమె ఫైర్ అయ్యారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన చంద్రబాబుకి గత 15 సంవత్సరాలుగా రాఖీ కడుతున్నానని సీతక్క గుర్తు చేశారు.
తాను రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యాక చంద్రబాబుకు రాఖీ కట్టలేదని ఆమె అన్నారు. ప్రాంతం వేరైనందుకో, బాబు సీఎం కానందుకో, పార్టీ మారినందుకో రాఖీ కట్టకుండా ఉండాలనుకునే వ్యక్తిని కాదని సీతక్క తేల్చి చెప్పారు. సమాజంలో కొంతమంది వ్యక్తులతో పరిచయాలు, అనుబంధాలు శాశ్వతంగా ఉంటాయని అన్నారు. ఈ సంవత్సరం తాను మూడు రోజులు రాఖీ పండుగ జరుపుకున్నానని చెప్పిన సీతక్క, సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు 500 మందికి రాఖీ కట్టానని తెలిపారు.
సమ్మక్క సారలమ్మ వారసులమని, దొరతనాన్ని తరిమికొట్టిన బిడ్డలమని.. మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బిడ్డా ఖబడ్దార్ అని వార్నింగ్ ఇచ్చారు సీతక్క. ఏపీ సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాతో కేసీఆర్ సంబంధాలపై సీతక్క విమర్శలు గుప్పించారు. నువ్వు తిరుపతిలో రోజమ్మ ఇంట్లో అన్నం తిని రావొచ్చు, రాయలసీమ పోయి నీళ్తు ఇస్తామని చెప్పి రావొచ్చని ఎద్దేవా చేశారు.
సీఎం జగన్ను కౌగిలించుకుని, వంగి వంగి దండాలు పెట్టి ఇప్పుడు గొడవపడుతున్నట్లు మోసం చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి సీతక్క ఘాటుగా వ్యాఖ్యానించారు. మంత్రి కేటీఆర్, కవిత మధ్య పంచాయితీ నడుస్తోందన్న సీతక్క, అందుకే ఆమె కేటీఆర్ కు రాఖీ కట్టేందుకు కూడా రాలేదని కామెంట్ చేశారు.