హైదరాబాద్- తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం పరోక్షంగా సంకేతాలిచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షలను కఠినతరం చేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. దీంతో ఇక రాష్ట్రంలో మరోసారి కరోనా ఆంక్షల దిశగా చర్యలు చేపడుతోందని తెలుస్తోంది.
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలంటూ హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని పై ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ, మహారాష్ట్ర తరహాలోనే ఆంక్షలు విధించాలని, జనాలు గుంపులుగా ఉండకుండా చూడాలని హైకోర్టు తెలంగాణ సర్కార్ కు సూచించింది.
హైకోర్టు ఆదేశాలపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పందించారు. ఒమిక్రాన్ కట్టడికి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తామని ఆయన చెప్పారు. హైకోర్టు ఆర్డర్ కాపీ తమకు అందిన వెంటనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని హరీష్ రావు తెలిపారు. హైదరాబాద్లోని దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డును గురువారం హరీశ్రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీష్ రావు, కరోనా నియంత్రణలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని చెప్పారు. కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో వ్యాపిస్తున్న నేపథ్యంలో చిన్న పిల్లల వ్యాక్సినేషన్, బూస్తర్ డోస్ పై కేంద్రం నుంచి ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదని ఆయన తెలిపారు. మొత్తానికి ఒమిక్రాన్ నేపధ్యంలో మరోసారి తెలంగాణలో ఆంక్షలు అమల్లోకి రాబోతున్నాయి.