నెల్లూరు- ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమ యాత్ర కొనసాగుతోంది. మేకపాటి అంతియాత్రలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. అంతకు ముందు మంగళవారం రాత్రి అమెరికా నుంచి మేకపాటి కుమారుడు నెల్లూరు చేరుకున్నారు.
మేకపాటి కుమారుడు కృష్ణార్జున రెడ్డి అమెరికా నుంచి నేరుగా చెన్నై చేరుకుని అక్కడి నుంచి నెల్లూరుకు వచ్చారు. రాత్రి 11 గంటల తర్వాత నెల్లూరు నగరంలోని నివాసానికి చేరుకున్నారు. అప్పటికే మంత్రి మేకపాటి పార్థివ దేహాన్ని మంత్రి చాంబర్లో ఉంచారు. తన తండ్రి భౌతిక దేహంతో తనను ఏకాంతంగా వదిలేసి అందరూ బయటికెళ్లాలని కృష్ణార్జునరెడ్డి కోరారు.
తన తండ్రి హృదయంపై సున్నితంగా తన చేయితో నిమురుతూ తనయుడు కృష్మార్జున రెడ్డి బోరున విలపించాడు. కృష్ణార్జున రెడ్డిని చూస్తూ పట్టరాని దుఃఖంతో మేకపాటి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించారు. అక్కడ ఆ దృశ్యాన్ని చూసినవారంతా కన్నీరు మున్నీరయ్యారు. మంత్రి మేకపాటి తుది సంస్కారానికి వీడ్కోలు పలకడానికి ఆయన స్నేహితుడు, సహచర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు.
దివంగత మంత్రి మేకపాటి తరహాలో వారసులు కుమార్తె సాయి అనన్య, కుమారుడు కృష్ణార్జున రెడ్డి ఆయన దుస్తులనే ధరించారు. నెల్లూరులోని మేకపాటి నివాసం నుంచి ఉదయం 6 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. జొన్నవాడ మీదుగా బుచ్చి, సంగం, నెల్లూరుపాళెం, మర్రిపాడు, బద్వేలు సరిహద్దు జాతీయ రహదారి నుంచి బ్రాహ్మణపల్లి, కృష్ణాపురం, నందిపాడు మీదుగా ఉదయగిరికి చేరుకుంటుంది. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో ఉదయం 11.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు.