స్పోర్స్ట్ డెస్క్- టీం ఇండియా ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ అయ్యింది. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ టీ-20 మ్యాచ్ ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా విరాట్ కోహ్లీ పేరిట రికార్డ్ ఉండేది. కానీ శుక్రవారంతో ఈ రికార్డ్ కాస్త బ్రేక్ అయ్యింది. న్యూజిలాండ్ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్ మార్టిన్ గప్తిల్ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు.
రాంచీ వేదికగా శుక్రవారం భారత్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ తో ఇంటర్నేషనల్ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో మార్టిన్ గప్తిల్ 15 బంతుల్లోనే 3×4, 2×6 సాయంతో 31 పరుగులు చేశాడు. ఇంటర్నేషనల్ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా శుక్రవారం వరకూ విరాట్ కోహ్లీ 3,227 పరుగులతో టాప్లో ఉన్నాడు. ఐతే భారత్ తో జరిని రెండో టీ-20 మ్యాచ్ లో 31 పరుగులు చేసిన మార్టిన్ గప్తిల్ 3,248 పరుగులతో విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్థానానికి చేరిపోయాడు.
విరాట్ కోహ్లీ మొత్తం 95 మ్యాచ్ ల్లో 137.90 స్ట్రైక్ రేట్తో ఈ పరుగులు చేయగా, మార్టిన్ గప్తిల్ 111 మ్యాచ్ల్లో 136.64 స్ట్రైక్ రేట్తో ఆ పరుగులు చేశాడు. ఇక ఇంటర్నేషనల్ టీ20ల్లో మార్టిన్ గప్తిల్ రెండు సెంచరీలు చేయగా, విరాట్ కోహ్లీ మాత్రం ఇంకా సెంచరీ మార్క్ ని చేరుకోలేదు. అన్నట్లు మార్టిన్ గప్తిల్, విరాట్ కోహ్లీ తర్వాత ఈ రికార్డ్ లో రోహిత్ శర్మ 3086 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.
అరోన్ ఫించ్ 2608 పరుగులతో నాలుగో స్థానంలో, స్టిర్లింగ్ 2570 పరుగులతో ఐదో స్థానంలో, డేవిడ్ వార్నర్ 2554 పరుగులతో ఆరో స్థానంలో, బాబర్ అజామ్ 2514 పరుగులతో ఏడో స్థానంలో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్, భారత్ మధ్య మూడు టీ20 ల సిరీస్ కి విరాట్ కోహ్లీ దూరంగా ఉంటుండగా, రోహిత్ శర్మ టీం ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.