హైదరాబాద్- తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు పిలుపునిచ్చారు. గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, గంజాయిపై బుధవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
హోంమంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో ఒక్క గంజాయి మొక్క కూడా ఉండేందుకు వీల్లేదని ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ అన్నారు. దీని కోసం డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో స్పెషల్ సెల్ ను ఏర్పాటు చేయాలని చెప్పారు. తమ గ్రామాల్లో గంజాయి సాగు వివరాలను సర్పంచులు ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలియజేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
పంట పొలాల్లో గంజాయి సాగు చేస్తే ఇకపై రైతు బంధు, రైతు బీమా పథకాలు నిలిపివేస్తామని సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద పొందిన భూముల్లో గంజాయి మొక్కలు పెంచితే పట్టాల రద్దు చేస్తామని తేల్చిచెప్పారు. తెలంగాణలో గంజాయితో పాటు మాదక ద్రవ్యాల నిరోధానికి ఏం కావాలన్నా చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
మత్తుపదార్థాల దుష్ఫలితాలపై ప్రభావవంతంగా నిర్మించే సినిమాలకు సబ్సిడీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ పై యువతలో మార్పు తీసుకొచ్చేలా షార్ట్ ఫిల్మ్లు, డాక్యుమెంటరీలు, సందేశాత్మక ఆడియో, వీడియో ప్రచార చిత్రాలను రూపొందించాలని ఆదేశించారు. గంజాయి నిర్మూలనలో మంచి ఫలితాలు సాధించిన అధికారులకు నగదు రివార్డులు, ప్రమోషన్లు, ఇతర ప్రోత్సాహకాలు ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.