పాలమూరు రూరల్- మహబూబ్ నగర్ జిల్లా మరో అద్భుతమైన కార్యక్రమానికి వేధిక అయ్యింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాలమూరు రికార్డు నెలకొల్పింది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా చెయ్యని వినూత్న కార్యక్రమంతో గిన్నిసీ రికార్డుల్లోకెక్కింది మహబూబ్ నగర్. అదికూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు మీద రికార్డు వెలకొల్పడం విశేషం.
మహబూబ్ నగర్ జిల్లాలోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. జిల్లాకు చెందిన మహిళా సమాఖ్య నేతలు పది రోజుల్లో 2 కోట్ల 8 లక్షల విత్తన బంతులను తయారు చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా వాటిని సోమవారం కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్లో వెదజల్లారు. దీంతో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోశ్ కుమార్, ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వ్రీనివాస్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డును గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అంకితమిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎస్పీ తదితరులు పాల్గొన్నారు. ఈ చారిత్రాత్మకమైన ఘట్టానికి కృషి చేసిన అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు.