కర్ణాటకలో కరోనా విలయతాండం చేస్తోంది. రోజురోజుకీ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటం కరోనా రోగులతో బెడ్లన్నీ నిండిపోవడంతో ఆస్పత్రుల ముందు హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రముఖులకూ కూడా కరోనా సోకితే బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ధార్వాడ జిల్లా కుందగోళ ఎమ్మెల్యే కుసుమ శివళ్ళి తన పరిస్థితి వివరిస్తూ కంటతడి పెట్టుకోవడం సంచలనంగా మారింది.
ప్రతిపక్షనేత సిద్దరామయ్య, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్లు వీడియో కాన్ఫరెన్స్ రూపంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ సమావేశం నిర్వహించారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే కుసుమ శివళ్ళి ఒక్కసారిగా కంటతడిపెట్టి తన కన్నతల్లి కరోనా బారినపడ్డారని, పరిస్థితి సీరియ్సగా ఉందని హుబ్బళ్ళి మెడికల్ కళాశాల ఆసుపత్రిలో ఓ పడక సమకూర్చుకోలేకపోతున్నానని రోదించారు. వెంటనే స్పందించిన సిద్దరామయ్య, కిమ్స్ డైరెక్టర్తో మాట్లాడుతానని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పరిస్థితి విషమంగా ఉందని చామరాజనగర్లో కరోనా బాధితులు ఆక్సిజన్ లభించక 24మంది మృతి చెందారన్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, బాధితులకు అవసరమైన సేవలు కల్పించాలని కొవిడ్ బాధితులలో మనోధైర్యం నింపాలని సూచించారు.