స్పెషల్ డెస్క్- ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చక్రం తిప్పిన కేఏ పాల్ గుర్తున్నారు కదా. మరి ఆ తరువాత ఏమైందో గాని పూర్తిగా చతికిలపడిపోయారు. ఎప్పుడు ఏదేశంలో ఉంటారో తెలియనంత బిజీగా ఉండే కేఏ పాల్ ప్రజా శాంతి పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. ఇక కేఏ పాల్ ఎక్కువగా ప్రపంచ రాజకీయాలు, సమస్యలపై మాట్లాడుతుంటారు. అందులో ప్రదానంగా పలు దేశాల మధ్య యుధ్దాలు జరగకుండా ఆపానని చెప్పుకుంటుంటారు కేఏ పాల్.
ఇదిగో ఇప్పుడు అఫ్ఘానీస్థాన్లో ప్రస్తుత పరిస్థితులపైనా కేఏ పాల్ స్పందించారు. ఆప్ఘాన్ లో తాజా పరిణామాలకు అమెరికానే కారణమని పాల్ అంటున్నారు. అఫ్ఘనిస్థాన్ లోని పరిస్థితులు చూస్తుంటే తన గుండె తరుక్కుపోతోందని కేఏ పాల్ ఆవేధన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా బలగాలు వెనుదిరగి వెళ్లిపోవడమేంటని కేఏ పాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అసలు తాలిబన్లతో యుద్ధం వద్దని తాను ముందే చెప్పానని గుర్తు చేసిన కేఏ పాల్, ఈ విషాదకర పరిస్థితులకు తన ఫ్రెండ్ జో బైడెన్ కారణమని అన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున అప్పులు చేస్తూ ఏపీ నాశనమైపోయిందన్న పాల్, బాగా డబ్బున్న తెలంగాణ కూడా నాశనమైపోయిందని వ్యాఖ్యానించారు.
తెలుగు రాష్ట్రాలంటే తనకు ఎంతో అభిమానమని, తెలుగు రాష్ట్రాలు నాశనమైపోతుంటే చాలా బాధకలుగుతోందని చెప్పారు. రెండు రాష్ట్రాలూ ఒకటైతే ఐదేళ్లలో అప్పులు తీర్చి అభివృద్ధి దిశగా అడుగులు వేయవచ్చని కేఏ పాల్ అన్నారు. ఇక దేశం నాశనం అవ్వడానికి రాజకీయ నేతలు కాదు, ప్రజలే కారణమని అభిప్రాయపడ్డారు కేఏ పాల్.