ప్రపంచంలో ఇప్పటి వరకు ఎన్నో వైరస్ లు వచ్చాయి.. అయితే వాటికి దిగ్విజయంగా వ్యాక్సిన్ కనుగొన్నారు. అయితే దశాబ్దాల కాలం నుంచి మలేరియా ప్రజలను పట్టి పీడుస్తూనే ఉంది. ప్రతి ఏడాది వందలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది ఆ మహమ్మారి. ముఖ్యంగా మలేరియా భారిన పడి లక్షల మంది చిన్నారులు కన్నుమూస్తున్నారు. ఇన్నాళ్లకు ఆ మహమ్మారికి సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోంది.
చిన్న పిల్లల కోసం ఈ వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపినట్టు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. అధికంగా మలేరియా వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో పిల్లల మరణాలను తగ్గించడానికి డబ్ల్యూటీఎస్ ఆర్టీఎస్ మలేరియా వ్యాక్సిన్ను సిఫార్సు చేస్తోంది. ఈ వ్యాక్సిన్ను 5 నెలలు పైబడిన పిల్లలకు వ్యాక్సిన్ అందించ వచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొన్నది. పిల్లలకు నాలుగు డోసుల్లో ఈ వ్యాక్సిన్ను అందిస్తారు. 2025 నాటికి ప్రపంచం నుంచి మలేరియాను నిర్మూలించడమే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే 25 దేశాలలో నిర్మూలన కార్యక్రమం కూడా ప్రారంభించారు.
ఇప్పటికే ఆఫ్రికాలోని మూడు దేశాల్లో 2.5 మిలియన్ డోసుల టీకాలు అందించారు. ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేవని, మలేరియాను అరికట్టేందుకు ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని క్లినికల్ ట్రయల్స్లో ఇప్పటికే వెల్లడైంది. 25 దేశాల్లో మొదట మలేరియా నిర్మూలన లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొన్నది. ఆఫ్రికా దేశాల్లో ప్రతి ఏడాది 2.65 లక్షల మంది చిన్నారులు మలేరియాతో మృతి చెందుతున్నారు. అయితే మలేరియాను నివారించడానికి ఇప్పటికే ఉన్న పరికరాల పైన ఈ మలేరియా వ్యాక్సిన్ను ఉపయోగించడంతో ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలను కాపాడవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.