వాట్సాప్ సోషల్ మెసేజింగ్ యాప్ కి సంబంధించి డేటా భారీగా లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 50 కోట్ల వాట్సాప్ వినియోగదారుల నంబర్లు హ్యాకర్ల చేతిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో భారత వాట్సాప్ వినియోగదారుల నంబర్లు కూడా ఉన్నట్టు సమాచారం. ఓ హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరమ్ లో ఈ ఫోన్ నంబర్ల విక్రయానికి సంబంధించి ఒక ప్రకటన పెట్టినట్లు విదేశీ సైబర్ న్యూస్ కథనం పేర్కొంది. 48.7 కోట్ల వాట్సాప్ వినియోగదారుల మొబైల్ నంబర్లతో 2022 డేటాబేస్ ను విక్రయిస్తున్నట్లు ఒక హ్యాకర్ ఆన్ లైన్ లో ప్రకటన ఇచ్చినట్లు కథనం వెల్లడించింది. అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఈజిప్టు, ఇటలీ, సౌదీ అరేబియా సహా 84 దేశాలకు చెందిన యూజర్ల మొబైల్ నంబర్లను విక్రయించేందుకు సిద్ధమయ్యారని తేలింది.
ఈజిప్టు నుంచి 4.5 కోట్ల మంది యూజర్ల నంబర్లు ఉండగా.. 3.5 కోట్ల ఇటలీ యూజర్లు, 3.2 కోట్ల అమెరికా యూజర్లు, 2.9 కోట్ల సౌదీ అరేబియా యూజర్లు, 2 కోట్ల ఫ్రాన్స్ యూజర్లు, 2 కోట్ల టర్కీ యూజర్లు, 1.1 కోట్ల యూకే యూజర్లు, కోటి రష్యా యూజర్ల నంబర్లు లీకైనట్లు తెలుస్తోంది. ఒక్కో దేశానికి చెందిన యూజర్ల నంబర్లను.. ఒక్కో ధరకు అమ్ముతున్నారని కథనం పేర్కొంది. అమెరికాకి చెందిన డేటాబేస్ ని 7 వేల డాలర్లకి, యూకే డేటాబేస్ ని 2500 డాలర్లకి, జర్మనీ డేటాబేస్ ని 2 వేల డాలర్లకి ధర నిర్ణయించినట్లు వెల్లడించింది. ఈ నంబర్లను సైబర్ నేరగాళ్లు కొనుగోలు చేసి.. మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని సైబర్ న్యూస్ కథనం వెల్లడించింది.
ఈ నంబర్లు ఒకసారి సైబర్ నేరగాళ్లు కొంటే గనుక.. లోన్లు, క్రెడిట్ కార్డుల పేరుతో కాల్ చేసి సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. కాగా మెటాకు చెందిన సంస్థల్లో డేటా లీక్ జరిగిందన్న వార్తలు రావడం ఇదేమీ తొలిసారి కాదు. గత ఏడాది కూడా 50 కోట్లకు పైగా ఫేస్ బుక్ యూజర్ల డేటా లీక్ అయినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వాట్సాప్ డేటా లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై మెటా సంస్థ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.