రోజుకో వింత జరుగుతుంది. ఎవరూ ఊహించని రీతిలో ప్రపంచంలోని ఒక్కో మూలాన ఒక్కో వింత చోటుచేసుకుంది. వైద్యరంగంలో సంచలనం ఇజ్రాయెల్లో నమోదైంది. అప్పుడే పుట్టిన ఓ ఆడశిశువు తల్లి గర్భంలో ఉండగానే గర్భం దాల్చి వైద్యులను ఆశ్చర్యచకితులను చేసింది. ఈ నవజాత శిశువులో ఒక్కటి కంటే ఎక్కువ పిండాలు ఉండటం వైద్యులు గుర్తించారు. మనిషి రూపాన్ని సంతరించుకున్న ఈ పిండాల్లో గుండె, ఎముకలు కూడా అభివృద్ధి చెందాయంట. సర్జరీ చేసి పిండాలను వైద్యులు తొలగించి చిన్నారికి వైద్యం అందిస్తున్నారు.
ఇజ్రాయిల్ దేశంలోని అష్ దొడ్ పట్టణంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఒక మహిళ ఆడశిశువుకు ఈ నెల తొలి వారంలో జన్మనిచ్చింది. అయితే ప్రసవ సమయానికి ముందు గర్భిణికి అల్ట్రాసౌండ్ పరీక్షలు జరిపారు. గర్భంలోని ఆడ శిశువు పొట్ట భాగం సాధారణంగా ఉండవలసిన పరిమాణం కంటే కాస్త ఎక్కువగా ఉండడం వైద్యులు గమనించారు.
ప్రసవం అనంతరం ఆ చిన్నారికి అల్ట్రాసౌండ్ మరియు ఎక్స్ రే పరీక్షలు జరిపారు వైద్యులు. ఆ నవజాతశిశువు కడుపులో ఒకటి కన్నా ఎక్కువ పిండాలు ఉన్నట్లు వైద్యులు. దీంతో ఆ వైద్యులు షాక్ కు గురయ్యారు. చేసేదేమీలేక వెంటనే చిన్నారికి సర్జరీ చేసి ఆ పిండాలను తీసేశారు.
ఇది చాలా అరుదైన సంఘటన అని డాక్టర్లు తెలిపారు. 10 లక్షల మందిలో ఒకరిలో మాత్రమే కనిపిస్తుందని డాక్టర్ ఒమర్ గ్లోబస్ తెలిపారు. చికిత్స అనంతరం పాప కోలుకుందని ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని తెలిపారు.