మనిషి డబ్బు కోసం ఎంతటి నీచమైన పనులు చేయడానికైనా సిద్దపడుతున్నారు. జాలీ, దయా.. మంచి, మానవత్వం మరిచిపోయి డబ్బుకోసం ఎన్నో దారుణమైన పనులు చేస్తున్నాడు. ఓ వ్యక్తి డబ్బు కోసం ఏడాది వయసు ఉన్న పిల్ల గొరిల్లాను తల్లి నుంచి దూరం చేసి జూ నిర్వాహకులు అమ్మాడు. అప్పటి నుంచి దాని జీవితం అంధకారంగా మారిపోయింది.. ప్రపంచంలోని అత్యంత విషాదకరమైన గొరిల్లా 32 సంవత్సరాలకు పైగా ఎత్తైన మాల్పై నిర్మించిన జూలో మగ్గిపోతూ దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తుంది. ఇంతకీ ఈ గొరిల్ల ఎక్కడ ఉంది..? దాని విషాదగాధ ఏంటో తెలుసుకుందాం.
జర్మనీలో పుట్టిన గొరిల్లా పేరు బువా నోయి.. ఏడాది వచ్చిన తర్వాత దాని సంరక్షకుడు ఏడు లక్షల పౌండ్లకు థాయ్ లాండ్ ‘పటా జూ’ నిర్వాహకులు అమ్మివేశాడు. బుజ్జి గొరిల్లాకు దాని ఏడాది వయసు నుంచి నరకం మొదలైంది.. 1990 లో తల్లి గొరిల్లా నుంచి దూరమై జూలో కి అడుగు పెట్టింది. అప్పటి నుంచి బువా నోయి కి బయటి ప్రపంచం అనేది ఎలా ఉంటుందో తెలియదు.. కనీసం దాని తోటి గొరిల్లాలను కూడా అది ఎప్పుడూ చూడలేకపోయింది. పుట్టినప్పటి నుంచి ఒకటే బోను.. అక్కడే తిండి.. అక్కడే నిద్ర… ఇప్పుడు ఆ బోను కూడా పూర్తిగా తుప్పుపట్టిపోయింది.
థాయ్ లాండ్ రాజధాని అయిన బ్యాంకాక్ లో ఒక ప్రైవేట్ కమర్షియల్ బిల్డింగ్ పై పటా జూ ఉంది.. ఈ జూకి గత 32 ఏళ్లుగా ప్రధాన ఆకర్షణగా బువా నోయి ఉంటూ వస్తుంది. అదే ఇప్పుడు అక్కడ వివాదాస్పద అంశంగా మారిపోయింది. ప్రాణం ఎవరిదైనా ఒకటే.. సంతోషంగా ఉండాలని ఏ జీవి అయినా కోరుకుంటుంది.. గత 32 ఏళ్లుగా ఒకే బోనులో జీవితం గడుపుతున్న బువా నోయి బాధ చూడలేక చాలా మంది దానిపై జాలి చూపించారు. 2015 నుండి థాయ్ ప్రభుత్వం, జంతు హక్కుల సంఘం పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA), పాప్ స్టార్ చెర్ బువా నోయికి స్వేచ్ఛ కల్పించాలని కోరుతూ ఉద్యమం చేపట్టారు. పటా జూ నిర్వాహకుడికి ఎన్నో విజ్ఞప్తులు చేశారు.
పటా జూ నిర్వాహకుడు మాత్రం దాన్ని కొన్నదానికన్నా ఎక్కువ చెల్లిస్తే తప్ప వృద్ద గొరిల్లా బువానోయిని బయటకు పంపించనని మొండిపట్టు పట్టాడు. జంతు సంరక్షకులు 7 లక్షల పౌండ్లు చెల్లిస్తామన్న ప్రతిసారి దాని రేటు మరింత పెంచుకుంటూ వెళ్లాడు. ఏడాది వయసులో బువా నోయి ని కొనే ముందు దాని యజమాని వద్ద అగ్రిమెంట్ చాలా బలంగా రాయించుకున్నాడు. ఈ కారణం చేతనే థాయ్ లాండ్ ప్రభుత్వం అతన్ని ఏమీ చేయలేక చేతులెత్తేసింది. కొంతమంది జంతు సంరక్షకులు ఫండ్ రైజింగ్ చేసి దాని ద్వారా బువా నోయిని విడిపించాలని ప్రయత్నించారు. కానీ పటా జూ నిర్వాహకుడు, అగ్రిమెంట్ లో ఉన్న లొసుగులు ఉపయోగించి రేటు పడనివ్వకుండా కృరంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు.. దాంతో థాయ్లాండ్లోని జంతు హక్కుల కార్యకర్తలు వృద్ధ గొరిల్లాను రక్షించలేకపోయారు.
ఇప్పటికే ఒంటరి జీవితం గడుపుతూ.. ఎలాంటి సంతోషాన్ని చూడని వృద్ద గొరిల్లా బువా నోయి కనీసం చనిపోయే ముందు స్వేచ్ఛగా చనిపోవాలని.. దానికి ఇకనైనా విముక్తి కలిపించాలని పలువురు కోరుతున్నారు. ఇందు కోసం థాయ్ లాండ్ కోర్టులో ఎన్నో పిటీషన్లు దాఖలు చేస్తున్నారు. ఇన్ని సంవ్సరాలు గడిచినా ఆ గొరిల్లా ఇంకా బంధీగానే ఉంటూ చావడం కన్నా.. దానికి చంపేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు ఇవ్వాని పిటీషన్లు వెల్లువలా వచ్చిపడుతున్నాయి.
ఈ విషయంపై పెటా ఏషియా వారు స్పందిస్తూ.. 32 ఏళ్లుగా ఎంతో దుర్భరమైన జీవితాన్ని గుడుపుతున్న బువా నోయి పరిస్థితి దారుణంగా తయారైందని.. ప్రభుత్వం కల్పించుకొని పటా జూని మొత్తానికి సీల్ చేసి అక్కడ ఉన్న జంతువులన్నింటికి స్వేచ్చ కల్పించే విధంగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్దమవుతున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఇప్పటికైనా ఆ వృద్ద గొరిల్లాకు స్వేచ్ఛ కల్పించాలని కోరుతున్నారు.