కడుపున పుట్టిన బిడ్డ.. తల్లిదండ్రుల కన్నా ముందే.. వారి కళ్ల ముందే మరణిస్తే.. ఆ కన్నవారు అనుభవించే కడుపుకోతను వర్ణించడానికి మాటలు చాలావు. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ల. ఆయన కుమారుడు జయన్ పుట్టకతోనే సెరిబ్రల్ పాల్సీ జబ్బుతో జన్మించాడు. ఇన్నాళ్లు.. దానితో పోరాడుతూ.. 26 వ ఏట జయన్ మృతి చెందాడు. ఐటీ ప్రపంచంలో సత్య నాదెళ్ల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. భారత సంతతికి చెందిన వ్యక్తి.. మైక్రోసాఫ్ట్ లాంటి అంతర్జాతీయ సంస్థకు సీఈఓగా ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఐటీ ప్రపంచంలో సక్సెస్ఫుల్ గా రాణిస్తూ.. అత్యున్నత శిఖరాలను అందుకున్న వ్యక్తిగా మాత్రమే సత్య నాదెళ్ల గురించి అందరికి తెలుసు. ఆయన జీవితంలో ఇంతటి విషాదం ఉందని.. కేవలం ఆయన సన్నిహితులకు మాత్రమే తెలుసు.
ఈ విషయం గురించి సత్య నాదెళ్ల ఒకానొక సందర్భంలో వివరించాడు. బ్లాగ్ లో ఈ విధంగా రాసుకొచ్చారు. ‘‘1996 లో జయన్ మా జీవితాల్లోకి వచ్చాడు. ఆ సంవత్సరం మాకు ఎంతో ఉద్వేగంగా గడిచింది. నేను, నా భార్య అను ఇద్దరం ఇండియాకు దూరంగా.. సీటెల్ నగరంలో స్థిరపడే ప్రయత్నాల్లో ఉన్నాం. నేను ఇంజనీర్గా… తను ఆర్కిటెక్ట్ గా పని చేస్తున్నాం. అప్పుడే జయన్ మా జీవితాల్లోకి రాబోతున్నాడనే వార్త తెలిసింది. తన రాక కోసం మేం ఆత్రుతగా ఎదురు చూడసాగాం. తన కోసం అన్ని సిద్ధం చేసి పెట్టాం. మా జీవితాల్లోకి కొత్త సంతోషాన్ని ఆహ్వానించడానికి మేం ఆత్రుతుగా ఎదురు చూస్తూ రోజులు గడపసాగా’’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి : మైక్రోసాఫ్ట్ కొత్త ఛైర్మన్ : సత్యనాదేళ్ల మరో ఘనత.
‘‘జయన్ రాక కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న రోజులవి. అప్పుడు అను 36 వ వారం గర్భంతో ఉంది. ఈ క్రమంలో ఓ రోజు రాత్రి.. తన గర్భంలో ఉన్న బేబీ అంతకు ముందులా ఎక్కువగా కదలడం లేదని గమనించింది. వెంటనే స్థానిక ఆస్పత్రికి వెళ్లాం. అనుని ఎమర్జెన్సీ రూంకి తీసుకెళ్లారు. రోటిన్ చెక్ అప్ మాత్రమే అనుకున్నాం. నేను ఎమర్జెన్సీ రూం బయట ఎదురు చూడసాగాను. ఎంత సేపటికి డాక్టర్ బయటకి రావడం లేదు.. నాలో టెన్షన్ పెరగసాగింది’’ అని నాడు జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు సత్య నాదెళ్ల.
‘‘టెస్ట్ ల అనంతరం డాక్టర్లు.. అనుకు వెంటనే సీజెరియన్ చేయాలని తెలిపారు. అలా 1996, ఆగస్టు 13 రాత్రి 11:29 నిమిషాలకు జయన్ జన్మించాడు. పుట్టినప్పుడు తన బరువు 3 పౌండు.. ఇక తను అస్సలు ఏడవలేదు. జయన్ పుట్టిన సంతోషంలో ఉన్నాం. కానీ భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉండబోతుందో అప్పుడు మాకు తెలియలేదు. జయన్ గర్భంలో ఉండగా జరిగిన ప్రమాదం గురించి మాకు రెండు సంత్సరాల తర్వాత తెలిసింది. జయన్ గర్భంలో ఉండగా.. అస్పిక్సియేషన్ (asphyxiation) బారిన పడ్డాడు. అంటే తల్లి గర్భంలో ఉండగా.. పిండం మెదడుకు సరిపడా ఆక్సిజన్, రక్త సరఫరా జరగలేదు. దీని ఫలితంగా జయన్ ‘సెరిబ్రల్ పాల్సీ’ అనే వ్యాధి బారిన పడ్డాడు. తను పుట్టినప్పుడు మాకు ఈ విషయాలు తెలియవు. తను బతికున్నంత కాలం వీల్ చైర్ కే పరిమితం అవుతాడని.. మా మీదే ఆధారపడతాడని.. మాకు అప్పుడు తెలియలేదు’’ అన్నారు.
సెరిబ్రల్ పాల్సీ, మస్తిష్క పక్షవాతం అనే ఈ వ్యాధిలో కండరాల సమన్వయం దెబ్బతింటుంది. ఇది ప్రధానంగా బిడ్డ పుట్టడానికి ముందు లేదా పుట్టిన తర్వాత లేదా జన్మించిన కొన్ని సంవత్సరాలలో మెదడు అభివృద్ధి చెందుతున్నప్పుడు.. బ్రెయిన్ దెబ్బ తినడం వల్ల వస్తుంది. మెదడులోని తెల్ల పదార్థం దెబ్బతినడం, అసాధారణ మెదడు అభివృద్ధి, మెదడులో రక్తస్రావం, ఆక్సిజన్ సరఫరా సరిగా లేకపోవడం వల్ల పుట్టుకకు ముందే మస్తిష్క పక్షవాతం సంభవిస్తుంది.
ఇది కూడా చదవండి : మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కుమారుడు మృతి
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 17 మిలియన్ల మంది సెరిబ్రల్ పాల్సీ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రతి ఏటా అక్టోబర్ 6న ప్రపంచ సెరిబ్రల్ పాల్సీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.