దేశంలో గత ఐదేండ్లలోనే ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ముఖ్యంగా 4జీ నెట్వర్క్ రంగ ప్రవేశం చేసిన తర్వాత సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. 2015 నుంచి 2018 వరకు సగటున ఏటా 5 కోట్ల మంది వినియోగదారులు పెరుగగా.. ఒక్క 2019లో ఏకంగా 13.5 కోట్ల మంది పెరిగారు. 2020లోనూ సుమారు 10 కోట్ల మంది పెరిగారు. 2024 నాటికి యూజర్ల సంఖ్య 110 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు సబ్మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు నిర్మిస్తున్నాయి. చేతికుండే వాచీల దగ్గరనుంచీ ఇంట్లోని బల్బులవరకూ ఈ సాంకేతికత ఆధారంగానే పనిచేస్తున్నాయి. వీటిలో చాలా వాటికి మొబైల్ ఇంటర్నెట్ కీలకం. 4జీతో పోల్చుకుంటే 5జీతో పరికరాల అనుసంధాన సామర్థ్యం వందరెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎంతలా అంటే, 5జీ సాంకేతికత ద్వారా ఒక చదరపు కిలోమీటర్లోని పది లక్షల పరికరాలను అనుసంధానించవచ్చుట.
‘సెల్ఫోన్ టవర్లనుంచి, మొబైల్స్ నుంచి వెలువడే రేడియేషన్ మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?’ అనే ప్రశ్న దశాబ్దకాలంగా వినిపిస్తున్నదే. దీనికి స్పష్టమైన జవాబులు మాత్రం లేవు. మొక్కలు, పక్షులమీద సెల్ఫోన్ టవర్ల రేడియేషన్ ప్రభావం ఉందని కొందరు పరిశోధకుల నమ్మకం. అయస్కాంత శక్తిమీద ఆధారపడే పక్షులను సెల్టవర్లు అయోమయానికి గురి చేస్తాయనీ, వీటినుంచి వెలువడే ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ వాటి గుడ్లను నాశనం చేస్తాయనీ వారంటున్నారు. ఈ విషయాల గురించికూడా కచ్చితమైన సమాచారం లేకపోవడం ఆశ్చర్యకరం. ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల విషయంగా ప్రత్యామ్నాయ మైన శాటిలైట్ ఇంటర్నెట్పై దృష్టి పడింది. మన ఫోన్ నుంచే నేరుగా శాటిలైట్కు అనుసంధానమై ఇంటర్నెట్ను పొందడానికి అవకాశం ఉంటుంది. అదే కంప్యూటర్లు అయితే కొన్ని ప్రత్యేక పరికరాల ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్కు అనుసంధానం కావడానికి వీలుంటుంది. అడవులు, కొండలు, గుట్టలు మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా ఇంటర్నెట్ అందుకోవచ్చు.
ఇప్పటికే నాసా సహా పలు దేశాల అంతరిక్ష సంస్థలు పరిమిత స్థాయిలో శాటిలైట్ ఫోన్, ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నాయి. ఇటీవలే ప్రైవేటు సంస్థలు ఈ రంగంలో కాలుపెట్టాయి. టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల యజమాని ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ‘స్టార్ లింక్’ పేరుతో ప్రాజెక్టు ప్రారంభించారు. మొత్తంగా 4,425 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపి.. ప్రపంచం నలుమూలలా ఇంటర్నెట్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 1,600కుపైగా శాటిలైట్లను పంపారు.