ఒక జాతి పక్షుల పేరు వింటే చాలు ఆ దేశం హడలెత్తిపోతోంది. చూడటానికి ఎంతో అందంగా ఉండే ఆ పక్షులు రైతులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఎక్కడి నుంచి ఏ పక్షి వస్తుందో, తమ పంటపొలాలను తినేస్తుందోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆ పక్షులపై యుద్ధం ప్రకటించేసిందో దేశం. ఇంతకీ ఆ దేశం ఏంటి, ఆ పక్షి పేరేంటని ఆలోచిస్తున్నారా? అయితే ఇదిగో ఆ వివరాలు.. ఎర్రటి ముక్కు, అందమైన రూపంతో ఉండే ఆ పక్షులను కెన్యా దేశస్థులు క్యులియా పక్షులు అని పిలుచుకుంటారు. కానీ ఇప్పుడీ పక్షి కనిపిస్తే చాలు కెన్యన్లు గడగడలాడిపోతున్నారు.
క్యులియా పక్షి నాయకులు, ప్రజలకు నిద్రలేకుండా చేస్తోంది. దీంతో కెన్యా ప్రభుత్వం వీటిపై యుద్ధం ప్రకటించింది. లక్షల సంఖ్యలో ఉన్న పక్షులను చంపేందుకు వార్ డిక్లేర్ చేసింది. కెన్యాలోని పంటపొలాలపై పడి వందల టన్నుల ఆహార ధాన్యాలను ఆరగిస్తూ.. అటు రైతులను, ఇటు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. కెన్యాలో పండే గోధుమ, సన్ఫ్లవర్, వరి, బార్లీ పంటలపై పడి నాశనం చేస్తున్నాయని అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. అందుకే క్యులియా పక్షులపై కెన్యా గవర్నమెంట్ వార్ డిక్లేర్ చేసింది. లక్షల పక్షులను చంపాలని డిసైడ్ అయ్యింది. ఆ దిశగా చర్యలను ప్రారంభించింది.
ఒకప్పుడు కరువు, కాటకాలతో తీవ్రంగా బాధపడిన కెన్యాను తిరిగి ఆ స్థితికి క్యులియా పక్షులు తీసుకొస్తాయేమోనని నేతల్లో ఆందోళన నెలకొంది. ఆ దేశంలో ఏటా పండుతున్న వందలాది టన్నుల ఆహార ధాన్యాలను చూస్తుండగానే మాయం చేస్తుండటంతో అన్నదాతలు, నాయకుల్లో గుబులు రేగుతోంది. గుంపులు, గుంపులుగా ఒకేసారి పంటలపై వాలుతున్న క్యులియా పక్షులు రైతుల చేతికొచ్చిన ధాన్యాన్ని క్షణాల్లో స్వాహా చేస్తున్నాయి. ఈ పక్షుల దాడిలో కెన్యా వ్యాప్తంగా దాదాపు 300 ఎకరాల్లో వరి పొలాలు ధ్వంసమైనట్లు ప్రభుత్వం గుర్తించింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) నివేదిక ప్రకారం.. ఒక క్యులియా పక్షి రోజుకు 10 గ్రాముల వరకు ధాన్యం తింటుంది. ఈ లెక్కన కెన్యాలోని రైతులు దాదాపు 60 టన్నుల ధాన్యం కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.
క్యులియా పక్షుల వల్ల ఏడాదికి సుమారు 50 మిలియన్ డాలర్ల పంటనష్టం వాటిల్లుతోందని ఎఫ్ఏఓ అంచనా వేసింది. పెంథియాన్, ఆర్గానో ఫాస్పేట్ పురుగు మందును పిచికారీ చేయడం వల్ల క్యులియా పక్షులను అంతమొందించాలని కెన్యా ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ రసాయనాలను ఉపయోగించడం వల్ల మనుషులతోపాటు ఇతర జీవుల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. పర్యావరణం దెబ్బతింటుందని, మూగజీవాలు చనిపోయే ఆస్కారం ఉందని అంటున్నారు. రసాయనాల ద్వారా పక్షులను చంపే బదులు.. వాటి ఉత్పత్తిని నియంత్రిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. క్యులియా సంతానోత్పత్తి ప్రాంతాలను గుర్తించి వాటి వృద్ధిని అరికట్టొచ్చని చెబుతున్నారు.