కొవిడ్ వ్యాక్సిన్ల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందు నుంచీ ఆందోళన చెందుతున్నట్లుగానే అగ్రరాజ్యాలుగా వెలుగొందుతోన్న ధనిక దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియలో దూసుకుపోతున్నాయి. అమెరికా జనాభా 33 కోట్లు కోగా, అందులో 28కోట్ల మంది ఇప్పటికే వ్యాక్సిన్లు పొందారు. ఇక బ్రిటన్ తాజాగా నాలుగో టీకాకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లన్నీ రెండు డోసులవి కాగా, జాన్సన్ అండ్ జాన్సన్కు చెందిన సింగిల్ డోస్ టీకాకు యూకే ఆమోదం తెలిపింది. యూకేలో ఆమోదం పొందిన నాలుగో వ్యాక్సిన్ ఇదే కావడం గమనార్హం. రెండు కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లను బ్రిటన్ ఆర్డర్ చేసింది. రాబోయే రోజుల్లో సింగిల్ డోస్ వ్యాక్సిన్ ముఖ్యమైన పాత్ర పోషించబోతోందని యూకే హెల్త్ అండ్ సోషల్ కేర్ విభాగం తెలిపింది.
భారత్లో కొత్త వేరియంట్ బయట పడిన నేపథ్యంలో యూకే లో యువత వ్యాక్సినేషన్ల కోసం పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారని తెలిపింది. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా 72శాతం ప్రభావవంతంగా పని చేస్తోందని అమెరికా ట్రయల్స్లో వెల్లడైంది. ప్రస్తుతం యూకేలో దాదాపు సగం జనాభాకు ఏదో ఒక వ్యాక్సిన్ కనీసం ఒక డోస్ అయినా పూర్తి అయింది. మిగతా వాక్సిన్లతో పోలిస్తే జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోసు టీకా ఆలస్యంగానే అనుమతులు పొందింది. అయినప్పటికీ జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు ఆమోదంతో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంటుందని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు.