మొబైల్ పోయిందా…’హాక్‌-ఐ’ లో ఫిర్యాదు చేయండిలా!..

సెల్‌ఫోన్ – ఇది ప్రతి వ్యక్తికి రోజువారి కార్యకలాపాల్లో తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్లు కన్పించడం సర్వసాధారణ విషయంగా మారింది. వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఫోన్లను అంతే జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఒక్కోసారి మన ఫోన్ చోరీకి గురవడమో లేదా పోగొట్టుకోవడమో జరుగుతుంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లలోకి యూపీఐ సేవలు అందుబాటులోకి రావడంతో నగదును క్యారీ చేయడం ఇప్పుడు తక్కువైందనే చెప్పాలి. మనలో చాలా మంది కూడా ప్రతి చోట నగదు లావాదేవీలను డిజిటల్‌ రూపంలోనే ఇప్పుడు చేస్తున్నాం.అంతలా ఫోన్ ప్రతి ఒక్కరికి బాగా అవసరమైన ఫోన్ పోతే మీ బ్యాంకు అకౌంట్ లో డబ్బులు స్వాహా అయినట్లే.

స్మార్ట్‌ఫోన్‌లను దొంగిలించిన దొంగలు టెక్నాలజీని వాడుకొని ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నారు. దొంగిలించిన స్మార్ట్ ఫోన్‌ను బ్లాక్‌ మార్కెట్‌ అమ్మడంతో పాటు, ఫోన్లో ఉన్న డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ల నుంచి కూడా నగదును కొట్టేస్తున్నారు. అంతేకాకుండా మీ విలువైన సమాచారాన్ని కూడా దొంగలు సేకరిస్తున్నారు. ఫోన్ కనుక పోతే ముందుగా మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలను పూర్తిగా బ్లాక్‌ చెయ్యాలి.

సిమ్‌ కార్డుతో రిజిస్టర్‌ అయిన యూపీఐ సేవలను వెంటనే డియాక్టివేట్‌ చేయాలి.అలాగే ఫోన్‌లో ఉన్న సిమ్‌ కార్డును వెంటనే బ్లాక్ చేయించండి. నంబర్‌పై రిజిస్టర్‌ అయిన అన్ని మొబైల్‌ వ్యాలెట్లను కూడా బ్లాక్‌ చేయండి. ఫైనల్ గా దగ్గరలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్‌ ని రిజిస్టర్‌ చేయండి. 2015లో ప్రారంభమైన ‘హాక్‌ – ఐ’ యాప్‌ అప్లికేషన్‌ ద్వారా ఇప్పటి వరకు మొత్తం 500 మొబైల్‌ ఫోన్‌లను గుర్తించి వాటిని తిరిగి బాధితులకు అందించారు. మొబైల్‌ ఫోన్‌ పోతే వెంటనే హాక్‌-ఐలో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇంటర్‌నెట్‌లో చాలా రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని రిజిష్టర్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ప్రత్యామ్నాయ ఫోన్ నంబరు ఇవ్వాలి. దొంగతనానికి గురైన ఫోన్‌లో సిమ్ వేసి వాడుతుంటే రిజిష్టర్ సమయంలో ఇచ్చిన నంబర్‌కు చోరీ అయిన ఫోన్ నంబరు, ప్రాంతం ఎస్‌ఎంఎస్ వస్తుంది.  సెల్ మళ్ళీ కొనుక్కోవచ్చని నిర్లక్ష్యం వహించకండి.  తస్మాత్ జాగ్రత్త.

 

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV