అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత అఫ్గానిస్థాన్లో పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. తాలిబన్ల పాలనలో ఇప్పటికే ఆర్థిక, ఆహార సంక్షోభంతో పొరుగు దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వీటిని పక్కనబెడితే.. మహిళలపై తాలిబన్ ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలు పెద్ద చర్చకే దారితీస్తున్నాయి. ఇన్నాళ్లూ అక్కడ స్త్రీలు మాత్రమే బురధా ధరించేవారు. ఇప్పుడు బొమ్మల ముఖాలకూ బురఖాను తప్పనిసరి చేశారు తాలిబన్లు. మహిళ బొమ్మైనా సరే ముఖం కనిపించకుండా బురఖా ఉండాల్సిందేనని తాలిబన్లు స్పష్టం చేస్తున్నారు. అఫ్గాన్ రాజధాని కాబూల్లోని ఒక బట్టల దుకాణంలో ప్రదర్శన కోసం ఉంచిన బొమ్మల ముఖాలకు ముసుగు కనిపిస్తోంది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహిళలు ఒంటరిగా బయటకు రాకూడదని, బురఖా తప్పనిసరిగా ధరించాలని అఫ్గాన్ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. విశ్వవిద్యాలయాల్లో స్త్రీలకు ప్రవేశం లేదని తాలిబన్ సర్కార్ తేల్చిచెప్పింది. జిమ్లు, పబ్లిక్ పార్కులు, అమ్యూజ్మెంట్ పార్కుల్లోకీ మహిళల్ని అనుమతించడం లేదు. ఇప్పుడు ఏకంగా దుకాణాల్లో ప్రదర్శనకు పెట్టే మహిళా బొమ్మలకూ ముసుగు ఉండాల్సిందేనంటూ కరాఖండీగా చెబుతోంది. గత్యంతరం లేక బొమ్మల ముఖాలకు ప్లాస్టిక్ కవర్, క్లాత్ బ్యాగులను కప్పుతున్నామని దుకాణాదారులు వాపోతున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త నయమని మరికొందరు అంటున్నారు. తాలిబన్లు గతంలో పాలించినప్పుడు షాపుల్లో మహిళల బొమ్మలు ఉంచేందుకు అస్సలు ఒప్పుకోలేదని.. ఒకవేళ ఉంచాల్సి వస్తే ఆ బొమ్మలకు తల లేకుండా చూడాలని ఆదేశించే వారని గుర్తుచేసుకున్నారు. మరి, అఫ్గాన్లో బొమ్మల ముఖాలకూ ముసుగును తప్పనిసరి చేసిన తాలిబన్ల పాలనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.