అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత అఫ్గానిస్థాన్లో పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. తాలిబన్ల పాలనలో ఇప్పటికే ఆర్థిక, ఆహార సంక్షోభంతో పొరుగు దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇలాంటి సమయంలో ప్రతికూల వాతావరణం అఫ్గాన్ల పాలిట శాపంగా మారింది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో అక్కడి ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలి దెబ్బకు గత వారం రోజుల్లోనే 78 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని స్వయంగా అఫ్గానిస్థాన్ జాతీయ విపత్తు ప్రతిస్పందనశాఖ వెల్లడించడం గమనార్హం.
అఫ్గానిస్థాన్లో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. ప్రస్తుతం -35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి గాలులను తట్టుకోలేక ఆ దేశ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతల ధాటికి ఒక వారం వ్యవధిలోనే 78 మంది పౌరులతోపాటు 75 వేల పశువులు కూడా మృతి చెందాయని తాలిబన్ అధికార ప్రతినిధి షఫీవుల్లా రహీమి తెలిపారు. చలి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సాధ్యమైనంత మేర సాయం చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.