ప్రపంచానికి లాంబ్దా వేరియంట్ సరికొత్త సవాల్ను విసురుతోంది. పెరూలో కనిపించిన ఈ వేరియంట్ బ్రిటన్కూ పాకింది. అక్కడి నుంచి 29దేశాలకు విస్తరించింది. ఇది ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ వైరస్ నిరంతరం రూపం మార్చుకుంటూ వస్తున్నది. డెల్టా ప్లస్ వేరియంట్ లేదా ఎఐ.1 వేరియంట్ను కూడా ‘ఆందోళనకరమైన వేరియంట్’ గా భారత ప్రభుత్వం ప్రకటించింది. సామర్ధ్యం అధికంగా కలిగి వుండడం, ఊపిరితిత్తుల కణజాలంలోని రెసెప్టర్లకు గట్టిగా అతుక్కుని వుండిపోవడం, మోనో క్లోనల్ యాంటీబాడీకి స్పందించే తీరు తగ్గిపోవడం. డెల్టా ప్లస్ వేరియంట్లో ఈ మూడు లక్షణాలు కనిపిస్తున్నాయి. దేశంలో ఓవైపు కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని భావిస్తున్న నేపథ్యంలో కొత్త వేరియంట్ పుట్టుకురావడం ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా తీసుకున్న 45,000 శాంపిల్స్ లో ‘డెల్టా ప్లస్’ వేరియంట్కు చెందిన 48 కరోనావైరస్ కేసులు గుర్తించినట్లు కేంద్రం చెప్పింది. ఇందులో మహారాష్ట్రలో అధికంగా 20 కేసులు గుర్తించారు. తమిళనాడులో తొమ్మిది కేసులు, మధ్యప్రదేశ్ లో ఏడూ, కేరళలో మూడూ, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో రెండేసి కేసులు, ఏపీ, ఒడిశా, రాజస్థాన్, జమ్మూ, కర్నాటకల్లో ఒక్కో కేసు చొప్పున ఈ పరీక్షల్లో గుర్తించారు. ఇండియాలో కరోనా రెండో దశ విజృంభణకు డెల్టా వేరియంటే కారణమని నిపుణులు చెబుతున్నారు.
స్పైక్ ప్రోటీన్లో K417N మ్యుటేషన్ పొందడం ద్వారా, దీన్ని రెండు రకాలుగా వర్గీకరించారు. వాటిలో ఒకటి డెల్టా వేరియంట్. WHO రిపోర్ట్ ప్రకారం, డెల్టా వేరియంట్ ఇప్పటివరకు కనీసం 74 దేశాలలో బయటపడింది. మరొక వేరియంట్ డెల్టా ప్లస్. కెనడా, జర్మనీ, రష్యా, నేపాల్, స్విట్జర్లాండ్, ఇండియా, పోలాండ్, పోర్చుగల్, జపాన్, అమెరికా దేశాల్లో కనిపించింది. ఈ దేశాల్లో ఇప్పటివరకు 63 కేసులు నమోదయ్యాయి. కొత్త వేరియంట్ల నుంచి కాపాడుకోవడానికి దేశంలోని కనీసం 80 శాతం ప్రజలకు టీకా వేయాలని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.