ఎప్పుడో 50 ఏళ్ల క్రితం చంద్రుడి మీదకు మనుషులు వెళ్లి వచ్చారు. మళ్ళీ ఆ తర్వాత ఇక వెళ్ళింది లేదు. చివరిసారిగా చంద్రుడి మీదకు వెళ్ళింది 1972 డిసెంబర్ లోనే. అపోలో 17 మిషన్ లో భాగంగా చంద్రుడి మీద అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇక ఏ దేశం కూడా వెళ్లే ప్రయత్నం చేయలేదు. అయితే చంద్రుడి మీద మనుషులు నివసించడం సాధ్యమే అని ఆ మధ్య ప్రచారం కూడా చేశారు. కానీ ఆ ప్రచారం కూడా ఇక సాధ్యం కాదేమో అనేలా చప్పబడిపోయింది. కట్ చేస్తే ఇప్పుడు అది సాధ్యమే అని నాసా అధికారులు చెబుతున్నారు. మనుషులు చంద్రుడి మీద జీవించవచ్చునని అంటున్నారు. ఈ దశాబ్దంలోనే అది సాధ్యమవుతుందని అంటున్నారు.
అందుకోసం నాసా చంద్రుడి మీదకు మనుషులను పంపడానికి ప్రయోగం చేపట్టిందని, ఆ ప్రయోగం విజయవంతంగా కొనసాగుతుందని నాసా అధికారి హోవార్డ్ హు వెల్లడించారు. ఈయన నాసా ఓరియాన్ చంద్రయాన అంతరిక్ష నౌక కార్యక్రమానికి సారథ్యం వహిస్తున్నారు. చంద్రుడి మీద శాస్త్ర పరిశోధన కార్యక్రమాల కోసం అక్కడ మానవ ఆవాసాల ఏర్పాటుకు వ్యోమగాములకు కొంతమంది మనుషుల అవసరం ఉంటుందని అన్నారు. అందుకోసం మనుషులను కూడా చంద్రుడి మీదకు పంపుతామని అన్నారు. ఈ నెల 16న బుధవారం నాడు కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి 100 మీటర్ల పొడవైన ఆర్టెమిస్ రాకెట్ లో ఓరియాన్ స్పేస్ క్రాఫ్ట్ ను పంపించారు. నవంబర్ 20 నాటికి ఓరియాన్ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడికి 1,34,000 కిలోమీటర్ల దూరంలో ఉందని హోవార్డ్ వెల్లడించారు.
చంద్రుడి మీద ఈ ఆర్టెమిస్ 1 రాకెట్ విజయవంతంగా ల్యాండ్ అయితే.. ఆ తర్వాత చేయబోయే ప్రయోగంలో చంద్రుడి మీదకు సాధారణ మనుషులను పంపిస్తామని.. అనంతరం వ్యోమగాములను పంపిస్తామని హోవార్డ్ వెల్లడించారు. అంతరిక్షనౌకను చంద్రుడి దిశగా తీసుకెళ్లిన ఆర్టెమిస్ రాకెట్ ప్రయోగం.. మానవ అంతరిక్షయానంలో చారిత్రాత్మక రోజు అని హోవార్డ్ అన్నారు. మనం మళ్ళీ చంద్రుడి మీదకు వెళ్తున్నామని, మనల్ని చంద్రుడి మీదకు తీసుకెళ్లి దింపే వాహనం ఇది అన్నారు. చంద్రుడి మీదకు వెళ్తున్న ఓరియాన్ స్పేస్ క్రాఫ్ట్ లో మనుషులకు బదులు.. మనుషులను పోలిన బొమ్మలను ఉంచారు. ఈ ప్రయాణంలో మనుషుల మీద పడే ప్రభావాలను ఆ బొమ్మలు నమోదు చేస్తాయని హోవార్డ్ వెల్లడించారు.
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రెండు సార్లు ఆర్టెమిస్ రాకెట్ ని ప్రయోగించి.. విఫలమయ్యామని అన్నారు. చివరి కౌంట్ డౌన్ సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా నిలిపివేసినట్లు తెలిపారు. అయితే మూడోసారి ప్రయత్నంలో రాకెట్ ని, దాని మీద అమర్చిన ఓరియాన్ స్పేస్ క్రాఫ్ట్ ను సక్సెస్ ఫుల్ గా ప్రయోగించినట్లు ఆయన వెల్లడించాడు. ఆర్టెమిస్ లోని పరిస్థితులు, వ్యవస్థలు అన్నీ అనుకూలంగా ఉన్నాయో లేదో పరీక్షించి.. అక్కడ ఉండబోయే మనుషులకు సమస్య లేదు అని నిర్ధారించుకున్న తర్వాతే మనుషులను చంద్రుడి పైకి పంపుతామని అన్నారు. ఈ అద్భుతమైన ఘట్టం ఈ పదేళ్లలో సాధ్యమవుతుందని అన్నారు. ఈ దశాబ్దంలోనే మనుషులను చంద్రుడి మీద నివసించేలా చేయాలన్నది నాసా లక్ష్యమని అన్నారు.
చంద్రుడి మీద మళ్ళీ మనుషులను పంపించడం వెనక ఉన్న లక్ష్యాల్లో.. ఆ ఉపగ్రహం దగ్గర నీరు ఉందా, లేదా అని అన్వేషించడం అని అన్నారు. అక్కడ నీరు ఉన్నట్లయితే.. విశ్వంలో మరింత దూరాలకు ప్రయాణించే అవకాశం ఉంటుందని అన్నారు. నాసా చంద్రుడి మీద మనుషులను దించుతుందని.. వారు చంద్రుడి మీద నివసిస్తూ పరిశోధనలు చేస్తారని హోవార్డ్ అన్నారు. నాసా చేసే ఈ ప్రయోగాలు.. భూమి కక్ష్యకు అవతల వైపు ఉన్న విశ్వం గురించి తెలుసుకునేందుకు, ఆ తర్వాత మార్స్ గ్రహం మీదకు మనుషులను పంపేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఒక స్థిరమైన వేదికను, రవాణా వ్యవస్థను రూపొందించుకోవడానికి.. ఈ ఆర్టెమిస్ మిషన్లు ఉపయోగపడతాయని హోవార్డ్ తెలిపారు.