డ్రాగన్ కంట్రీ చైనా ఎప్పుడూ ఇండియా సరిహద్దులను ఆక్రమించు కోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే రీసెంట్ గా మరో దుస్సాహసానికి పాల్పడింది చైనా. ఇండియా సరిహద్దులోకి బలగాలను వేగంగా తరలించేందుకు తగిన వనరులను సిద్ధం చేసుకుంటున్న డ్రాగన్ ఆ దిశగా కార్యాచరణ కూడా వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే అరుణాచల్ ప్రదేశ్ కు అత్యంత సమీపంలో ఉన్న టిబెట్ సరిహద్దు ప్రాంతానికి బుల్లెట్ ట్రైన్ ను ప్రారంభించింది. దీంతో బలగాలను వేగంగా వాస్తవాధీన రేఖ వద్దకు చేర్చే అవకాశం కలుగుతుంది. టిబెట్ రాజధాని లాసా నుంచి నింగ్ చి ప్రాంతం వరకు ఎలక్ట్రిఫైడ్ బుల్లెట్ ట్రైన్ సేవలను చైనా నేడే (శుక్రవారం) ప్రారంభించింది. 435 కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్ నిర్మాణ పనులను ప్రారంభించింది. టిబెట్ లో పూర్తిస్థాయిలో విద్యుదీకరణ ఇచ్చిన మొట్టమొదటి రైల్వే లైన్ ఇదే. ఈ బుల్లెట్ రైలుతో సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డు నుంచి లాసా మధ్య ప్రయాణ దూరం 48 గంటల నుంచి 13 గంటలకు తగ్గనుందని డ్రాగన్ చెబుతోంది.
టిబెట్ ప్రాంతంలో చైనా ప్రారంభించిన రెండో రైల్వే లైన్ ఇది. ఇండియాలోని అరుణాచల్ సరిహద్దుకు ఈ నింగ్ చి నగరం అత్యంత సమీపం ఉంటుంది. ఈ ప్రాంతం వరకు బుల్లెట్ ట్రైన్ ను చైనా తీసుకు రావడం గమనార్హం. ఈ బుల్లెట్ ట్రైన్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా ఇంకా ఎలాంటి దుస్సాహసాలకు పాల్పడిందోనని ఆందోళన చెందుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్లో భాగమని చైనా చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈ రైలు మార్గం ఏర్పాటు అందరినీ ఆలోచనలో పడేస్తోంది.
హిమాలయ ప్రాంతంలోని నాలుగువేల కిలోమీటర్ల సరిహద్దులపై పట్టు సాధించాలంటే టిబెట్ కీలకం కావడంతో సరిహద్దు గ్రామాల అభివృద్ధి పేరుతో వ్యూహాత్మకంగా అడగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా బుల్లెట్ రైలు సేవలు తీసుకొచ్చింది.