అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. కాబూల్ ను వశం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. తాలిబన్ల పాలన తలచుకుని అఫ్గాన్ ప్రజలు భయపడు తున్నారు. తాలిబన్లు కాబూల్ను చుట్టుముట్టడంతో ఆఫ్ఘనిస్థాన్ నుంచి పారి పోయిన (మాజీ) దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ గురించి రష్యన్ ఎంబసీ సంచలన విషయం బయటపెట్టింది. దేశం విడిచి వెళ్లే సమయంలో ఘనీ నాలుగు కార్లు, ఒక హెలికాప్టర్ నిండా డబ్బు కట్టలు నింపుకున్నారని రష్యన్ అధికారులు అంటున్నారు. ఘనీ, ఆయన భార్య, చీఫ్ ఆఫ్ స్టాఫ్, దేశ భద్రతా సలహాదారు ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్కు పారిపోయారని అల్ జజీరా వార్తా సంస్థ వెల్లడించింది.
నాలుగు కార్ల నిండా డబ్బులు నింపుకుని హెలికాప్టర్ లో అష్రఫ్ ఘనీ వెళ్లారని అఫ్గాన్ లోని రష్యన్ ఎంబసీ తెలిపినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. హెలికాప్టర్ లో మరింత డబ్బును కుక్కేందుకు యత్నించారని, అయితే సరిపడా స్థలం లేకపోవడంతో పెద్దమొత్తంలో డబ్బులను వదిలేసి వెళ్లినట్లు సమాచారం. అయితే ఎంత వరకూ నిజముందనే విషయంలో సరైన స్పష్టత లేదు. ఘనీ పరారైన కాసేపటికే కాబూల్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు, అనంతరం అధ్యక్ష భవనాన్ని కూడా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
దీంతో ఆఫ్ఘనిస్థాన్ మొత్తం తాలిబన్ల ఏలుబడిలోకి వచ్చినట్లయింది. తాలిబన్లు కాబూల్ లోకి ఎంటర్ కావడంతోనే ఘనీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. రక్త పాతాన్ని తగ్గించేందుకు తాను కాబూల్ ను వదిలి వెళ్లానని తర్వాత ఆయనే స్వయంగా ప్రకటించారు. అయితే ఘనీ భారీగా నగదుతో దేశాన్ని వీడారని రష్యా రాయబార సంస్థ కామెంట్స్ చేయడంపై ఆ దేశం వ్యూహంగా కనిపిస్తోంది. తాలిబన్లతో సంబంధాలు మెరుగు పరుచుకునేందుకే రష్యా ఈ వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు విశ్లేషకులు