పెద్ద పెద్ద చదువులు చదివినా సరైన అవకాశాలు లేక యువత నిరుద్యోగులుగా మారుతున్నారు. చిన్న చిన్న పోస్టులకు కూడా అప్లై చేస్తూ ఏదో ఒక ఉద్యోగం దొరికేచాలు అనే పరిస్థితికి వస్తున్నారు. ఇదే క్రమంలో కేవలం ఒకే ఒక ప్యూన్ పోస్టు ఏకంగా 15 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని బట్టి నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి నెలకొంది పాకిస్తాన్లో. ఈ కరోనా మహ్మమారి వల్ల ప్రతి దేశంలో పరిస్థితి ఇలాగే ఉంది. ఏ చిన్న నోటిఫికేషన్ వెలువడిన దరఖాస్తులు లక్షల సంఖ్యలో వస్తున్నాయి. పాకిస్తాన్ కోర్టులో ఒక్క ప్యూన్ పోస్ట్ కోసం దరఖాస్తులు కోరగా 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఎంఫిల్ చేసిన అభ్యర్థులు కూడా ఉన్నట్లు సమాచారం.
కరోనా సమయంలో పాక్లో దాదాపు 2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం పాక్లో నిరుద్యోగిత రేటు 16 శాతం దాటిందని పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ (పీఐడీఈ) కొత్త గణాంకాలను బట్టి తెలుస్తున్నది. ప్రస్తుతం చదువుకున్న యువతలో 24 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ తన సర్వే వివరాలను సెనేట్ స్టాండింగ్ కమిటీకి వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో 40 శాతం గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా ఉన్నారు. వీరిలో ఎంఫిల్ చదివిన వారు కూడా చాలా మంది ఉన్నారు. వీరిని కూడా గణాంకాల్లో చేర్చినట్లయితే నిరుద్యోగిత రేటు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరో నివేదిక పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ లేబర్ ఫోర్స్ సర్వే (ఎల్ఎఫ్ఎస్) ప్రకారం, పాకిస్తాన్లో నిరుద్యోగం 2017-18లో 5.8శాతం నుంచి 2018-19లో 6.9 శాతానికి పెరిగింది. పురుషుల్లో నిరుద్యోగం 5.1 శాతం నుంచి 5.9 శాతానికి పెరగగా.. మహిళా నిరుద్యోగం 8.3 శాతం నుంచి 10 శాతానికి పెరిగింది.