హైదరాబాద్- సమాజంలో నేరాలు, ఘోరాలు యధావిధిగా జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నా నేరస్తుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఎక్కడో ఓ చోట ఏదో ఓ నేరం వెలుగ చూస్తూనే ఉంది. అందులను మహిళలు, అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి.
తాజాగా హైదరాబాద్ లో ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు బాలికకు మాయమాటలు చెప్పి తమ గదికి తీసుకెళ్లిన యువకులు దారుణానికి ఒడిగట్టారు. బాలిక తప్పించుకుని తల్లిదండ్రులకు జరిగింది చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
నగరంలోని బోరబండ ప్రాంతంలో ఓ బస్తీకి చెందిన 17 ఏళ్ల బాలిక ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో పాల ప్యాకెట్ తీసుకువచ్చేందుకు సమీపంలోని షాపుకు వెళ్లింది. ఆ సమయంలో అదే బస్తీకి చెందిన 22 ఏళ్ల శివ కన్ను ఆ బాలికపై పడింది. ఆమెకు ఏవో మాయ మాటలు చెప్పి దగ్గర్లోని మరో బస్తీలో ఉండే కార్మికుడిగా పనిచేస్తున్న అతడి స్నేహితుడు 20 ఏళ్ల సాయి గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరు కలిసి బాలికపై అత్యాచారం చేశారు.
మరుసటి రోజు సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు వారి గది నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి వెళ్లి తల్లికి జరిగిన ఘోరం గురించి చెప్పింది. వెంటనే కూతురిని తీసుకుని ఎస్సార్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు శివ, సాయిలపై పోక్సో, అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, విచారణ చేస్తున్నారు.