జగిత్యాల- కట్టుకున్న భార్యను ప్రేమగా చూసుకోవాల్సిన భర్త అదనపు కట్నం కోసం వేధించాడు. అదనపు కట్నం ఇచ్చుకోలేనని పుట్టింటికి వెళ్లిన భార్యపై పగ పెంచుకున్న ఆ దుర్మార్గుడు ఆమెను నవ్వుల పాలు చేయాలని చూశాడు. ఆమె ఏకాంతంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కానీ ఆఖరికి అతనే కటకటాల పాలయ్యాడు. ఈ దారుణమైన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.
ఇబ్రహీంపట్నంకి చెందిన సంతోష్కి అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో నాలుగేళ్ల కిందట పెళ్లైంది. మూడేళ్లు పాటు భార్యను బాగానే చూసుకున్న సంతోష్ ఆ తరువాత తన అసలు రూపం బయటపెట్టాడు. అందుకు అనుగునంగా ఆమెకి అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త, అత్తా, మామలు వేధించేవారు. అత్తింటి వేధింపులు భరించలేకపోయిన ఆమె పుట్టింటికి వచ్చింది.
అదనపు కట్నం కోరిక తీర్చలేదని భార్యపై కోపం పెంచుకున్న భర్త దారుణానికి పాల్పడ్డాడు. తనతో భార్య ఏకాంతంగా ఉన్న సమయంలో రహస్యంగా తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడా దుర్మార్గుడు. ఆమె అర్ధనగ్నంగా ఉన్న ఫొటోలను ఫేస్బుక్, వాట్సాప్లలో పోస్ట్ చేసి రాక్షసానందం పొందాడు. తన ఫొటోలను సోషల్ మీడియాలో చూసిన బాధితురాలు వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులకు పిర్యాదు చేసింది.
విచారణ చేపట్టిన పోలీసులు, ఈ పని చేసింది ఆమె భర్తేనని తేల్చారు. ఇంకేముందు వెంటనే ఆ కీచక భర్తపై గృహ హింస, వరకట్నం, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. జీవితాంతం తోడుగా ఉంటానని పెళ్లినాడు చేసిన ప్రమాణాన్ని తుంగలో తొక్కి, సొంత పెళ్లాన్ని అల్లరి పాలు చేసిన ప్రబుద్ధుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.