మంచిర్యాల- ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఓ మధురమైన ఘట్టం. జీవితంలో ఒక్కసారి వచ్చే ఆ సందర్బానికి సంబందించిన అనుభూతులు జీవితాంతం గుర్తుండిపోతాయి. అందుకే పెళ్లిని అందరు తమ తమ తాహతుకు తగ్గట్టుగా ఘనంగా చేసుకుంటారు. కొత్త జీవితంలోకి అడుగుపెతూ ఎన్నో కలలు కంటారు అబ్బాయి, అమ్మాయి.
ఇక పెళ్లంటేనే అమ్మాయి సిగ్గు పడటం సర్వసాధారణం. కానీ ఈ కాలం అమ్మాయిలు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఇక్కడ ఓ పెళ్లి కూతురు సిగ్గుపడం కాదు, స్వయంగా తనకు కాబోయే భర్తకు పాట రూపంలో స్వాగతం పలికింది. తన సంతోషాన్ని డాన్స్ చేసి మరీ పెళ్లి కొడుకు తెలిపింది. డుగు డుగు అనే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ కు డాన్స్ చేసింది వధువు.
పెళ్లి సందర్బంగా నిర్వహించిన బరాత్ లో బంధువులు, స్నేహితులు మధ్య ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. బుల్లెట్ బండి అనే ప్రయివేట్ ఆల్బమ్ సాంగ్కు వధువు చేసిన ఈ డ్యాన్స్ చూసి నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. ఈ కొత్త పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ వీడియో యూట్యూబ్లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. కోట్ల వ్యూస్తో దూసుకుపోతోంది.
మంచిర్యాల జిల్లా జన్నారంలో ఈ నెల 14న సాయిశ్రియ, అశోక్ వివాహం జరిగింది. పెళ్లి బరాత్లో వధువు సాయి శ్రియ సంతోషం పట్టలేక ఇలా డ్యాన్స్ చేసింది. ఈ డాన్స్ ను ఆమె బంధువులు వీడియో తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. ఇంకేముంది ఇది బాగా వైరల్ అయ్యింది. తన భర్తను సర్ప్రైజ్ చేసేందుకే డ్యాన్స్ చేశానని చెప్పిన వధువు సాయి శ్రియ, ఇంతలా వైరల్ అవుతుందని ఆనుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.