క్లినికల్ ట్రయల్స్ తర్వాత కోవిడ్-19 లక్షణాలను 15 నుంచి 11 రోజులకు రెమ్డెసివిర్ తగ్గించగలదన్న గుర్తింపు రావడంతో ఆ ఔషధానికి డిమాండ్ పెరిగింది. కానీ అది దివ్యౌషధమేమీ కాదని నిపుణులు హెచ్చరించారు. దీంతో కరోనా అత్యవసర చికిత్సలో వాడే రెమ్డెసివిర్ ఇంజక్షన్ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వీటిని రాష్ట్రాలకు సరఫరా చేయరాదని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రస్తుతం దేశంలో రెమ్డెసివిర్ ఇంజక్షన్లు చాలినన్ని నిల్వ ఉన్నాయన్నారు. వీటిని ఉత్పత్తి చేసే కంపెనీలు కూడా నెల రోజుల్లోనే 20 నుంచి 60కి పెరిగినట్టు చెప్పారు. ఏప్రిల్ 11న రోజుకు 33 వేల వయల్స్ మాత్రమే ఉత్పత్తి కాగా, ఇప్పుడా సంఖ్య 3.50 లక్షలకు పెరిగిందని చెప్పారు. కాబట్టి ఇప్పుడు వీటిని రాష్ట్రాలకు సరఫరా చేయడాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
అత్యవసరాల కోసం మాత్రం కేంద్రం 50 లక్షల రెమ్డెసివిర్ వయల్స్ను సమకూర్చుకోవాలని నిర్ణయించిందన్నారు. రెమ్డెసివిర్కు గత నెలలో విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో ఈ యాంటీ వైరల్ ఇంజక్షన్ ధరను తగ్గించిన ప్రభుత్వం రెమ్డెసివిర్, దాని తయారీకి అవసరమయ్యే ముడి సరుకుల దిగుమతులపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. నెలన్నర సమయంలో రెమ్డెసివిర్ ఔషధ ఉత్పత్తిని పది రెట్లు పెంచామని తెలిపారు. రాష్ట్రాలకు సరఫరా నిలిపివేసినా, ఈ ఔషధం అందుబాటుపై కేంద్ర పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.