నల్గొండ- ఈ కాలంలో కాలేజీకి వెళ్లే పిల్లల కోరికల గురించి అందరికి తెలుసు. తమ స్నేహితులు కాలేజీకి బైక్ పై వస్తున్నారని, తమకు కూడా బైక్ కొనివ్వాలని తల్లిదండ్రులను అడిగే పిల్లలను మనం చాలా మందినే చూస్తుంటాం. కానీ ఓ అడపిల్ల మాత్రం అందుకు విభిన్నంగా కాలేజీకి వెళ్తోంది. బైక్ పై కాదు ఆటోలో ఆ విధ్యార్ధిని కాలేజీకి వెళ్లివస్తోంది.
ఆ ఆటోలో కాలేజీవికి వెళ్లి రావడం గురించి ఇంత ప్రత్యేకంగా చెబుతున్నారేంటి, అందులో కొత్తేం ఉంది. చాలా మంది అమ్మాయిలు ఆటోలో కాలేజీకి వెళ్లివస్టుంటారు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే.. ఆ అమ్మాయి చదువుకుంటూనే ఆటో నడుపుతోంది. అవును ఓ వైపు చదువుకుంటూనే, మరో వైపు కుటుంబాన్ని పోషించేందుకు ఆటో నడుపుతోంది.
చదువుకుంటూనే, ఆటో రిక్షా నడుపుతూ కుటుంబానికి అండగా నిలుస్తూ చాలా మందికి ఆదర్శంగా నిలుస్తోంది నల్గొండకు చెందిన విధ్యార్ధిని. శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామానికి చెందిన 19 ఏళ్ల ఈ అమ్మాయి పేరు సబిత. ఆమె తండ్రి ఆరేళ్ల కిందట అనారోగ్యంతో చనిపోయాడు. వాళ్లది రెక్కాడితే గానీ, డొక్కాడని నిరుపేద కుటుంబం. కుటుంబాని పెద్ద దిక్కైన తండ్రి మరణించడంతో పోషించే భారమంతా తల్లి మీద పడింది. రెక్కలు ముక్కలు చేసుకుంటూ తనను చదివించడానికి కష్టపడితున్న తల్లిని చూసి.. సబిత తీవ్ర ఆందోళన చెందింది.
తల్లి కష్టం చూడలేక తనే రంగంలోకి దిగింది. ఓ ఆటో రిక్షా నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. అంతే కాదు తన చదువును సైతం కొనసాగిస్తోంది. సబిత ప్రస్తుతం నకిరేకల్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతోంది సబిత. ఆమె సొంత ఊరు నుంచి నకిరేకల్ 21 కిలో మీటర్లు ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం కాలేజీ బ్యాగు తీసుకుని, ఆటో రిక్షా తీసుకుని, ప్యాసింజర్స్ ను ఎక్కించుకొని నకిరేకల్ వెళ్తుంది. అలా ప్యాసింజర్స్ ను వారి గమ్యస్థానాలకు చేర్చుతూ.. చివరికి కాలేజీకి వెళ్తుంది. అక్కడ కాలేజ్ అయ్యాక, మళ్లీ తిరుగు ప్రయాణం కూడా ఇలాగే సాగుతుంది.
కాలేజీకి సెలవు రోజైన ఆదివారం మాత్రం మొత్తం రోజంతా ఆటో నడుపుతుంది. ప్రతి రోజూ 200 నుంచి 300 రూపాయలు సంపాదిస్తోంది సబిత. అమ్మానాన్నలు ఇచ్చే పాకెట్ మనీతో స్నేహితులతో సరదాగా కాలేజీ రోజులను ఎంజాయ్ చేయాలనుకునే వయసులో కుటుంబ భారాన్ని మోస్తున్న సబిత అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.