హైదరాబాద్- తెలుగు రాష్ట్రాల్లో గత రెండు మూడు రోజులుగా ఓ మోస్టారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జన జీవనం అస్తవ్యస్థం అయిపోయింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక పలు జిల్లాల్లోని ప్రజలు సైతం భారీ వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా శనివారం పలుచోట్ల పెద్ద పెద్ద శబ్దాలతో కూడిన ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. పలు జిల్లాల్లో వరదనీరు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. పిడుగుపాట్లకు రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో బజార్ హత్నూర్ మండలం బుర్కపల్లిలో పిడుగు పాటుకు రైతు దంపతులు బనియాగరన్ సింగ్ (45), ఆశాబాయి (40) మృతి చెందారు.
అదే జిల్లా తాంసి మండలం బండలనాగాపూర్ కు చెందిన దీపారాథోడ్ (17) అనే బాలిక ఇంటి వద్ద ఆడుకుంటుండగా పిడుగు పడటంతో అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేటలో పిడుగు పడటంతో కౌలు రైతు గొళ్ల తిరుపతి (40) మృతి చెందాడు. అంతే కాదు మరో నలుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.
ఇక ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం గూడమామడకు చెందిన పెట్కురె గణపతి (35) అనే వ్యక్తి పిడుగుపాటుకు గురై మరణించగా, మరో రైతు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. హైదరాబాద్ కూకట్పల్లి వెంకటేశ్వర నగర్లోని ఓ ఇంటిపై పిడుగు పండటంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పిడుగు ధాటికి మట్టిగోడ ధ్వంసమై శిథిలాలు ఓ కారు మీద పడ్డాయి. ఐతే ఎవరికి ఎలాంటి అపాయం జరగలేదు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పిడుగుల వర్షం కురవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.