హైదరాబాద్- జంటనగరాల్లో ఒకటైన సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం సంభవించింది. బ్రిటిషర్ల కాలంలో నిర్మించిన మిలిటరీ క్లబ్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో క్లబ్ భవనం పూర్తిగా దగ్ధమైంది.
అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దింపారు. సుమారు 3 గంటలు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బ్రిటీషర్ల హయాంలో 1878లో మిలిటరీ అధికారుల కోసం ఈ క్లబ్ ను నిర్మించారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్లబ్ నిర్మాణం జరిగింది.
దీన్ని భారతీయ వారసత్వ సంపదగా గుర్తించిన కేంద్రం 2017లో పోస్టల్ కవర్ కూడా విడుదల చేసింది. 5వేల మందికి పైగా మెంబర్షిప్ ఉన్న ఈ క్లబ్లో సుమారు 300 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 20 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.