కరోనా వల్ల ఇతర దేశాలకు వెళ్ళాలంతే వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి చేసుకున్న సర్టిఫికేట్ అడుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఏ దేశానికి వెళ్తున్నారో, ఆ దేశం వారు కొన్ని ప్రత్యేక వ్యాక్సిన్లు తీసుకున్న వారిని మాత్రమే తమ దేశంలోకి రావడానికి అనుమతి ఇస్తున్నారు. భారత్ లో తయారైన కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రపంచదేశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిదేశాలు తమ భూభాగంలోకి ప్రవేశాన్ని నిరాకరిస్తున్నాయి. భారత్ లో తయారైన కొవిషీల్డ్ తీసుకుని యూరప్ వెళుతున్నవారికి అక్కడి దేశాలు గ్రీన్ పాస్ రూపంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గ్రీన్ పాస్ జాబితాలో లేని టీకాలు తీసుకున్నవారిని యూరోపియన్ యూనియన్ దేశాలు అనుమతించడంలేదు.
యూరోపియన్ యూనియన్ వ్యాక్సిన్ల పాస్ పోర్టు లిస్టుని ప్రకటించింది. అందులో ఇండియాకి చెందిన కోవిషీల్డ్ లేకపోవడం గమనార్హం. పూనేకి చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవీషీల్డ్ ని తయారు చేసింది. ఐతే ఈ వ్యాక్సిన్ ఫార్ములా మాత్రం ఆస్ట్రాజెనికా ఆక్స్ ఫర్డ్ వారిదే. ఇది యూరప్ కి చెందిన కంపెనీయే. కొవిషీల్డ్ తీసుకున్న భారతీయుల్లో చాలామంది యూరప్ వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే సమస్య పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తానని పూనావాలా హామీ ఇచ్చారు.
ఔషధ నియంత్రణ సంస్థలతోనూ చర్చించడమే కాకుండా, దౌత్యమార్గాల్లోనూ అనుమతుల కోసం చర్యలు తీసుకుంటామని వివరించారు. యూరోపియన్ యూనియన్ వ్యాక్సిన్ పాస్ పోర్టుకి అనుమతి లభించిన వ్యాక్సిన్లలో ఫైజర్, మోడెర్నా, వ్యాక్స్ జెవిరియా, జాన్సన్ ఉన్నాయి. చిత్రమేమిటంటే ఇందులో ఉన్న వ్యాక్స్ జెవిరియా వ్యాక్సిన్ ని కూడా ఆస్ట్రాజెనికా ఆక్స్ ఫర్డ్ తయారు చేసింది. మరి దీనికి కారణాలేంటన్నది ఇంకా తెలియదు.