కరోనా విజృంభణ,లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులెదుర్కొంటున్న పేదలకు ఆర్థిక తోడ్పాటు అందించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలోని ఆటోవాలాలు, ట్యాక్సీ వాలాలకు రూ.5000 చొప్పున వారి వారి అకౌంట్లలో వేయనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రకటించారు.
ఆటో, టాక్సీ డ్రైవర్లకు 5 వేలరూపాయల ఆర్ధిక సహాయం ఇవ్వాలని నిర్ణయించింది. సాధ్యమైనంత త్వరగా ఈ సాయాన్ని అందజేస్తామని ఆయన మంగళవారం ప్రకటించారు. దీనివల్ల వారు కొంతవరకైనా తమ ఆర్ధిక నష్టాల నుంచి బయటపడతారని అన్నారు. అలాగే రేషన్ కార్డులు ఉన్నవారందరికీ రెండు నెలలపాటు ఉచితంగా రేషన్ అందజేస్తామన్నారు. నగరంలో 72 లక్షల మంది రేషన్ కార్డుహోల్డర్లు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నగరంలో పరిస్థితి మెరుగు పడిన పక్షంలో లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. కోవిడ్ కారణంగా గత ఏడాది కూడా 1.56 లక్షల మందిఆటో, టాక్సీ డ్రైవర్లకు 5 వేలు, నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులకు 10 వేల ఆర్ధిక సాయాన్ని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
ఒక్కరోజే నగరంలో 18 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 448 మంది రోగులు మరణించారు. వరుసగా చితులు కాలుతున్న దృశ్యాలను విదేశీ మీడియా కవర్ చేస్తోంది. ఇండియా ఎంతటి విషమ స్థితిలో చిక్కుకుందో ప్రపంచ దేశాలకు విదేశీ మీడియా వివరిస్తోంది. అటు-వరుసగా ఢిల్లీలో మూడో రోజైన సోమవారం కూడా మృతుల సంఖ్య 400 దాటిపోయింది. కాగా గత వారంతో పోలిస్తే సిటీలో ఈ వారం కేసులు స్వల్పంగా తగ్గడం విశేషం. పరిస్థితి ఇలాగే మెరుగుపడగలదని ప్రభుత్వం ఆశిస్తోంది. కోవిడ్ టెస్టుల సంఖ్య కూడా తగ్గింది. గత ఆదివారం 61,045 టెస్టులు నిర్వహించారు. అయితే పాజిటివిటీ రేటు 28.33 శాతం ఉందని, ఇది ఇంకా తగ్గాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్ 22 న ఇది 30 శాతాన్ని మించిపోయింది. మరోవైపు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. కామన్ వెల్త్ గేమ్స్ విలేజీని కోవిడ్ సెంటర్ గా మార్చేసింది. అక్కడ ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసింది. మరికొన్ని రోజుల్లో మరిన్ని కామన్ వెల్త్ గేమ్స్ విలేజీలను కూడా కోవిద్ సెంటర్లుగా మార్చాలన్న యోచన ప్రభుత్వానికి ఉంది.