న్యూ ఢిల్లీ- కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వదలడం లేదు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తరువాత కాస్త ఊపిరి పీల్చుకుంటున్న మానవాళిని మళ్లీ ధర్డ్ వేవ్ ముంచెత్తుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. కరోనా వైరస్ జంతువులను వదిలిపెట్టడం లేదు.
తాజాగా చెన్నైలోని ఓ జూలో రెండు సింహాలు కరోనా సోకి మృత్యువాతపడ్డాయి. ఈ నేపథ్యంలో జంతువులకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు హరియాణాలోని ఐసీఏఆర్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ తో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతోంది.
దేశవ్యాప్తంగా ఉన్న ఆరు జూలలో ఈ క్లినికల్ ట్రయల్స్ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కేవలం సింహాలు, పులులు, చిరుత పులులకు మాత్రమే కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఎంపిక చేసిన ఆరు జూలలో జునాగడ్ లోని సక్కర్ బాగ్ ఉంది. ఈ జూలో 70కి పైగా సింహాలు, 50 చిరుతపులులు ఉన్నాయి. మొదటి డోస్ వ్యాక్సిన్ ఇచ్చిన 28 రోజుల తర్వాత రెండో డోస్ ఇవ్వాలని నిర్ణయించారు.
జంతువుల కోసం కరొనా టీకాను అభివృద్ధి చేయాలని ఎన్ఆర్సీఈ కి కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఇటీవల ఆదేశాలిచ్చింది. ఒక జాతికి చెందిన జంతువులు 15కి మించి ఉన్న జూలలోనే క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే ట్రయల్స్ ప్రారంభించనున్నామని సక్కర్బాగ్ జూ డైరెక్టర్ అభిషేక్ కుమార్ చెప్పారు.