తమిళనాడులో ప్రతీకార రాజకీయాలకు మళ్లీ తెరలేస్తుందని కథనాలు అల్లేసుకున్నారు. తమిళనాడు నూతన సారథి ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ ఊరుకునేవారు కాదని భావించారు. కానీ స్టాలిన్ మాత్రం సరికొత్త రాజకీయాలకు తెరతీశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజునుంచే తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రతిపక్షాలు కూడా నిర్మోహమాటంగా స్టాలిన్ను శభాష్ అంటున్నాయి. ప్రజలకు ఏది అవసరం అనుకుంటే దాన్ని కొనసాగిస్తున్నారు. జయలలితన పేరట వెలిసిన అమ్మ క్యాంటిన్లను తీసేయకుండా కొనసాగిస్తున్నారు. అమ్మ క్యాంటిన్ల వల్ల అన్నా డీఎంకేకు మంచి పేరు వస్తుందని భావించలేదు. అతి తక్కువ ధరకు పది మందికి కడుపు నిండా అన్నం పెట్టే అమ్మ క్యాంటిన్ల పట్ల ఉదారంగా వ్యవహరించారు స్టాలిన్. ప్రత్యేకించి లాక్డౌన్ సమయంలో అలాంటివే కడుపు నింపుతాయన్న స్పృహ స్టాలిన్కు ఉంది కాబట్టే ఆ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో, తమ గ్రామంలో తాగునీటి వసతిని కల్పించాలని ఇద్దరు బాలికలు ‘మీ నియోజకవర్గంలో స్టాలిన్’కు రాసిన లేఖకు స్పందించిన స్టాలిన్ వారి గ్రామంలో తాగునీటి వసతి కోసం రూ.8 లక్షలు కేటాయించారు. తిరువారూర్ జిల్లా కోట్టూరు సమీపం వాత్తార్ గ్రామానికి చెందిన అన్బళగన్ కుమార్తెలు కయల్విళి 8వ తరగతి, చిన్న కుమార్తె కార్కుయిలి 6వ తరగతి చదువుతున్నారు. ఆ గ్రామంలో పర్యటించిన స్టాలిన్కు కయల్విళి, కార్కుయిలి అందజేసిన వినతిపత్రంలో, వత్తారు పంచాయితీలో పదేళ్లుగా ఉప్పు నీరు వస్తోందని, ఈ ప్రాంతంలో ఓఎన్జీసీ సంస్థ చేపట్టిన హైడ్రోకార్బన్ వెలికితీత కారణంగా భూగర్భజలాలు అడుగంటాయన్నారు. కాలుష్యమైన నీటిని తాగడం ద్వారా పిల్లలు, వృద్ధులు అనారోగ్యం బారిన పడుతున్నారని, తమ గ్రామంలో తాగునీటి శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటుచేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. తిరువారూర్, మన్నార్గుడి డీఎంకే ఎమ్మెల్యేలు కలైవానన్, రాజా, ఎస్పీ సెల్వరాజ్ ఆదివారం ఇద్దరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పిలి పించి, మీ లేఖపై సీఎం స్పందించారని, మీ గ్రామంలో తాగునీటి శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటుకు రూ.8 లక్షలు మంజూరు చేశారని, త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలియజేసి, అక్కాచెల్లెళ్లను అభినందించారు.