కరీంనగర్- విడిపోయిన తమను తిరిగి కలిపిన టీఆర్ఎస్ పార్టీ రుణాన్ని, తమ సంతానానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు పెట్టుకొని తీర్చుకుంది ఓ జంట. కరీంనగర్ రామడుగు మండలం ఎంపిపి కలికేటి కవిత, లక్ష్మణ్ దంపతులది ఒక ఆసక్తికరమైన కధ. వీరికి ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఇద్దరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. దీంతో వారి వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేసే వరకు వెళ్లింది పరిస్థితి.
ఇక తాము కలిసి ఉండలేమని, విడాకులే శరణ్యమని ఆ దంపతులు ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఎంపిటిసి ఎన్నికలొచ్చాయి. ఈ ఎన్నికల్లో రామడుగు మండలం ఎంపిటిసి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. కాగా మండలంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుడుగా ఉన్న కలికేటి లక్ష్మణ్ టికెట్ కోసం ఆశించాడు. తమ తల్లికి ఎంపిటిసి టికెట్ ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ను కోరాడు. దానికి ఎమ్మెల్యే తిరస్కరించి విడిపోయిన భార్యతో కలిసి ఉంటేనే నీకు టికెట్ ఇస్తానని షరతు విధించాడు.
ఎమ్మెల్యే విధించిన షరతు నచ్చకపోయినా, రాజకీయాల మీద ఉన్న ఇష్టంతో లక్ష్మణ్ తలొగ్గాల్సి వచ్చింది. విడిపోదామనుకున్న తన భార్యతో ఎమ్మెల్యే ద్వారా తిరిగి సంప్రదింపులు జరిపారు. ఇద్దరిని కౌన్సిలింగ్ ఇచ్చి విడిపోదామనుకున్న జంటను ఎమ్మెల్యే కలిపారు. ఆ తరువాత ఇచ్చిన మాట ప్రకారం లక్ష్మణ్ భార్య కవితకు ఎంపిటిసిగా టికెట్ ఇచ్చి గెలిపించుకున్న ఎమ్మెల్యే ఆమెను రామడుగు మండలం ఎంపిపిగా ఎన్నుకున్నారు.
అప్పటి నుంచి కవిత, లక్ష్మణ్ అన్యోన్యంగా ఉంటున్నారు. వారికి ఇటీవలే కుమారుడు జన్మించాడు. తమను తిరిగి కలిపింది టీఆర్ ఎస్ పార్టీయే కాబట్టి, పార్టీకి తమ రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవాలని ఆలోచించిన ఆ జంట, తమ బిడ్డకు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పేరు పెట్టుకొని పార్టీ రుణం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా బిడ్డకు నామకరణం చేయించుకోవాలని, గత రెండు నెలలుగా ఎదురుచూశారు.
సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చొరవతో, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి అదే విషయాన్ని అభ్యర్థించారు. వారి కోరికను మన్నించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారి బిడ్డకు కేటీఆర్ అని పేరు పెట్టారు.