హైదరాబాద్- తెలంగాణలో ప్రఖ్యాత దేవస్థానం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునప్రారంభోత్సవానికి కంగం సిద్దం అవుతోంది. సుమారు నాలుగేళ్లుగా కొనసాగుతున్న యాదాద్రి దేవస్థాన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలోయాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునప్రారంభంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చినజీయర్ స్వామితో సమావేశమయ్యారు.
ఆదివారం సాయంత్రం ముచ్చర్లలోని ఆశ్రమంలో జరిగిన వీరి చర్చల్లో మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణం చేపట్టాలని, 21 నుంచి మహా సుదర్శనయాగం నిర్వహించాలని ముహూర్తం ఖరారు చేశారు. మహా కుంభ సంప్రోక్షణం, మహా సుదర్శనయాగం ఏర్పాట్లు, ఆహ్వానాలు, సంబంధిత అంశాలపై చినజీయర్ స్వామితో సీఎం కేసీఆర్ చర్చించారు. చినజీయర్ స్వామి ఖరారు చేసిన ముహూర్తం ప్రకారం మార్చి 28న గర్భాలయంలోని స్వయంభువుల నిజదర్శనాలను భక్తులకు కల్పించనున్నారని తెలుస్తోంది.
ముచ్చర్లలోని చిన జీయర్ స్వామి ఆశ్రమంలో జరిగే సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. చినజీయర్ స్వామితో కలిసి ముఖ్యమంత్రి యాగశాలను సందర్శించారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆ ఏర్పాట్లను స్వయంగా సీఎం కేసీఆర్ కు చినజీయర్ స్వామి వివరించారు. ముఖ్యంత్రితో పాటు మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్, మైం హోం గ్రూప్స్ అధినేత రామేశ్వరరావు ఉన్నారు.
ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు భగవద్రామానుజుల సహస్రాబ్ది వేడుకలు ముచ్చింతల్ లోని ఆశ్రమంలో వైభవంగా జరగబోతున్నాయి. 200 ఎకరాల్లో భగవద్రామానుజుల 216 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ సందర్భంగా 128 యాగశాలల్లో హోమం నిర్వహిస్తారు. సహస్రాబ్ది వేడుకల కోసం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇప్పటికే ఆహ్వానించారు.
ఫిబ్రవరిలో జరిగే యాగ సమయంలో ఏ మాత్రం అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరోవైపు మిషన్ భగరీథ నీరు అందించాలని అధికారులకు సూచించారు. యాగానికి సంబంధించిన ఏర్పాట్లు, అవసరాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి చెప్పారు.