అమరావతి- టోక్యో ఒలింపిక్స్ లో మన తెలుగు తేజం పీవీ సింధు తన సత్తా చాటింది. బ్యాడ్మింటన్లో కాంస్య పతకం సాధించి మన దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ నేపధ్యంలో పీవీ సింధుకు నగదు ప్రోత్సాహకం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పీవీ సింధుతో పాటు అంతర్జాతీయ, జాతీయ క్రీడా వేదికలపై పతకాలు సాధించిన రాష్ట్రానికి చెందిన ఇతర క్రీడాకారులకు కూడా నగదు ప్రోత్సాహకాలు అందించాలని సీఎం స్పష్టం చేశారు.
రెండు ఒలింపిక్స్లో వరుసగా రెండు పతకాలు సాధించి పీవీ సింధు చరిత్ర సృష్టించారన్న ముఖ్యమంత్రి జగన్, సింధు విజయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తి అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్ననే పీవీ సింధుకు విశాఖపట్నంలో అకాడమీ నిర్వహణ కోసం 2 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. టోక్యో ఒలింపిక్స్కి వెళ్లే ముందు రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, సాత్విక్, హాకీ క్రీడాకారిణి రజనిలకు 5 లక్షల రూపాయల చొప్పున నగదు సహాయం అందించింది ఏపీ సర్కార్.
ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన వారికి 75 లక్షలు, రజత పతకం సాధించిన వారికి 50 లక్షలు, కాంస్య పతకం సాధించిన వారికి 30 లక్షలను నగదు ప్రోత్సాహకంగా ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కాంస్య పతకం సాధించిన పీవీ సింధుకు 30 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సింధుకు నగదు పురస్కారాన్ని అందించనుందని తెలుస్తోంది.